గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకే మేడారం ట్రోఫీ
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడేందుకు కృషి చేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్కుమార్
ములుగురూరల్, మార్చి17: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్కుమార్ అన్నారు. ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల మైదానంలో మేడారం ట్రోఫీ జిల్లా స్థాయి క్రీడలను సీపీతోపాటు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీసి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే పోలీస్శాఖ ఆధ్వర్యంలో మేడారం ట్రోఫీ పేరున క్రీడా పోటీలను నిర్వహిస్తున్నా మని అన్నారు. విద్యార్థులు జిల్లాస్థాయిలో ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని అన్నారు. అనంతరం తెలంగాణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి చేరుకొని విజయాన్ని అందుకోవాలని సూచించారు. త్వరలో పెద్ద ఎత్తున కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పోస్టులు పడనున్నాయని, ఇందులో గిరిజన విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ములుగు జిల్లాలోని గిరిజన క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా మండల స్థాయి వారీగా గతంలో క్రీడలను నిర్వహించి ప్రస్తుతం జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. గిరిజన విద్యార్థులు అసాంఘిక శక్తుల మాటలను నమ్మి పెడదారి పట్టవద్దని అన్నారు. విద్యతోపాటు క్రీడల్లో రాణించి ఉద్యోగ నియామకాల్లో పట్టు సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్టీ శోభన్కుమార్, ములుగు, ఏటూరునాగారం ఏఎస్పీలు సాయిచైతన్య, గౌస్ ఆలం, ట్రైనీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సీఐ కొత్త దేవేందర్రెడ్డి, ఎస్సైలు హరికృష్ణ, డీవీ ఫణితోపాటు జిల్లాలోని ఆయా మండలాల ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.