ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందుగానే ఇంటి పన్నులు, నల్లా బిల్లులు వసూలు చేయడమే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. వందశాతం పన్ను వసూళ్లు చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచే ఇంటింటికీ తిరుగుతూ మున్సిపల్ సిబ్బంది పన్ను వసూలు చేస్తున్నారు. మార్చి 31లోగా చెల్లించాలని అధికారులు తెలపడంతో స్వచ్ఛందంగా ఇంటి యజమానులు ముందుకొచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. కొన్నిచోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 17మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, సంగారెడ్డి, అమీన్పూర్, తెల్లాపూర్, జహీరాబాద్, అందోల్, బొల్లారం, నారాయణ్ఖేడ్, సదాశివపేట్, మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట్ మున్సిపాలిటీల్ల్లో ఇప్పటి వరకు లక్ష్యానికి మించి పన్ను వసూళ్లు పూర్తయ్యాయి. మున్సిపల్ సిబ్బంది, అధికారులు ఇంటి యజమానులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఆటోలకు మైకులు పెట్టించి ప్రచారం చేపడుతున్నారు. సంగారెడ్డి, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉమ్మడి జిల్లాలో 85శాతం వరకు పన్ను వసూళ్లు చేసి అగ్రస్థానంలో నిలిచాయి.
ఈనెల 31 గడువు..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17మున్సిపాలిటీల్లో అధికారులు ఇంటి పన్నులను నిర్దేశిత గడువులోగా వసూలు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో 75శాతం మేర పన్నులు వసూలు చేశారు. ఈ నెల 31లోగా లక్ష్యానికి చేరుకొనేలా జిల్లాలోని మున్సిపల్ అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ సారి ప్రత్యేక కార్యాచరణతో వసూలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డిలో 85.70శాతం వసూలు కాగా, అతి తక్కువగా చేర్యాలలో 38.96శాతం మాత్రమే పన్ను వసూళ్లయి చివరలో ఉంది. ఈ నెల 31లోగా చెల్లించి వడ్డీ మాఫీ పొందాలని ఇంటి యజమానులకు సమాచారం అందిస్తున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాఫూర్, క్యాసారం, మూట్రాజ్పల్లి, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్, గుండన్నపల్లి 8674 గృహ సముదాయాలు ఉన్నాయి. వీటిలో గజ్వేల్, ప్రజ్ఞాఫూర్లో వ్యాపార సముదాయాలు అధికంగా ఉన్నాయి. రెండు, మూడంతస్తుల గృహాలు అధికంగా ఉండడంతో ఇంటి పన్నుల రాబడి అధికంగా వస్తున్నది. కొన్నేండ్లుగా ఇంటి పన్నులు చెల్లించని వారికి మున్సిపల్ అధికారులు వడ్డీ రాయితీ కల్పిస్తున్నారు.
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రూ.10వేలలోపు ఇంటి పన్ను ఉన్న నివాస గృహాలకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50శాతం రాయితీని ప్రకటించింది. జీవో 207 ప్రకారం 2019-2020 మార్చి వరకు ఎంత బకాయి ఉన్నా, ఆ బకాయిపై ఉన్న వడ్డీపై 90శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.