జిల్లాలో 2900 యాక్టివ్ కేసులు n వ్యాక్సిన్ కొరత లేదు
18 ఏండ్లు పైబడిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్
ఎదులాపురం, ఏప్రిల్ 29 : కొవిడ్ లక్షణాలున్నవారు పరీక్ష చేయించుకోవాలని, వైద్యులు ఇచ్చిన మాత్రలు వేసుకోవాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా వచ్చిన ఆదేశాల మేరకు కొవిడ్ లక్షణాలున్నవారు మాత్రమే మాత్రలు వేసుకోవాలని సూచించారు. కొవిడ్ నిర్ధారణ, వ్యాక్సిన్ జాతీయ సంపద అని, వాటిని కాపాడాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా పరీక్షల కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. తీవ్రస్థాయిలో కొవిడ్ లక్షణాలున్న వారు కచ్చితంగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని, ఎలాంటి సందేహాలున్నా హెల్త్ డెస్క్కు కాల్ చేయాలని సూచించారు.
జిల్లాలో వ్యాక్సిన్ కొరత లేదు..
జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ కొరత లేదని డీఎంహెచ్వో తెలిపారు. ప్రస్తుతం 10వేల డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని టీకా తీసుకోవాలన్నారు. వ్యాధి తీవ్రత తగ్గించాలంటే టీకానే ఏకైక మార్గమన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 12,664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం జిల్లాలో 2,900 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 9704 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు.