సూర్యాపేట, ఆగస్టు 6 : రైతన్న మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం తీసుకొచ్చింది. పట్టదారు పాస్ పుస్తకం కలిగి ఉండి 18 ఏళ్లు నిండి 59ఏండ్ల వరకు ఉన్న ప్రతి రైతుకూ బీమా సౌకర్యం కల్పించారు. బీమా మొత్తం రూ.5 లక్షలు వచ్చేలా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గడిచిన మూడు సంవత్సరాలుగా ఎంతో మంది రైతులకు ఆ పథకం ఉపయోగపడుతూ వస్తున్నది. 2020-21 సంవత్సరానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 886మంది రైతులు మరణించగా ఇప్పటివరకు 724 మందికి రూ.36.20 కోట్లు చెల్లించారు. మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. 2021-22 సంవత్సరానికి ఆగస్టు 3వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన వారిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది.
రైతు బీమా పథకం ప్రారంభ సంవత్సరంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1,25,550మంది రైతులు అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వారికి బీమా కల్పించింది. ఆ ఏడాది జిల్లా వ్యాప్తంగా 609మంది రైతులు చనిపోగా 608 మంది రైతులకు రూ.30.40 కోట్లు చెల్లించింది. 2019 ఆగస్టు 15 నాటికి జిల్లాలో రైతుల సంఖ్య పెరిగింది. 1,45,570మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. 2019లో జిల్లావ్యాప్తంగా 640మంది చనిపోగా 634మందికి బీమా కింద రూ.31.70 కోట్లు చెల్లించారు. ఆరుగురిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా పథకం ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 2,135 మంది రైతులు మృతిచెందారు. అందులో 1,966మందికి నగదు సుమారు రూ.98.30 కోట్లు చెల్లించారు. ఇంకా ఈ ఏడాది 168 మంది రైతులకు బీమా చెల్లించాల్సి ఉంది. వీరందరికి చెల్లిస్తే రూ.8.10 కోట్లు కానున్నాయి. ఆగస్టు 14వరకు మరణించిన వారికి కూడా ఈ ఏడాది కిందనే బీమా వర్తించనున్నది.
ఆగస్టు 3వరకు పట్టా కలిగి ఉండాలి
2020-21 సంవత్సరానికి ప్రీమియం గడువు ఈ ఆగస్టు 15తో ముగియనున్నది. 2021-22 సంవత్సరానికి కొత్త ప్రీమియం చెల్లించాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 3వరకు పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతునూ అర్హుడిగా గుర్తించింది. ఈ గడవు లోపు బీమాకు కావల్సిన పత్రాలను స్థానిక వ్యవసాయ అధికారులకు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా తేదీ ప్రకటించలేదు.
ఆదేశాలు అందగానే..
2021-22 సంవత్సరానికి రైతుబీమా దరఖాస్తుకు సంబంధించి ఆదేశాలు రాలేదు. రాగానే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. 2020-21 సంవత్సరంలో ఇప్పటివరకు 886మంది రైతులు మరణించగా వారిలో 724మందికి బీమా ైక్లెమ్ చేశాం. మిగిలిన వారికి త్వరలోనే క్లియర్ చేస్తాం.