మల్యాల, మార్చి 17: పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న నామస్మరణతో మార్మోగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణ అంకురార్పణ బుధవారం వైభవోపేతంగా జరిగింది. కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో రెండు మండలాల కాలం (82రోజులు) పాటు సాగే పారాయణ కార్యక్రమాన్ని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అఖిల భారత హనుమాన్ పీఠం పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామిజీ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ముందుగా సాయంత్రం 4.30గంటల తర్వాత చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఎమ్మెల్సీ కవిత కొండగట్టుపై ఉన్న వై జంక్షన్కు చేరుకున్నారు. వరంగల్కు చెందిన చక్రపాణి తాను రాసిన రామకోటి ప్రతులతోపాటు చెన్నైలో తన సన్నిహితులు పూర్తి చేసిన ఐదు కోట్ల రామకోటి ప్రతులను తీసుకొని కొండగట్టుపైకి రాగా, కవితకు జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, సురేశ్ దంపతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాల ప్రదర్శన మధ్య శోభాయాత్రగా ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. రామకోటి ప్రతులను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. శిరస్సున ఉంచిన పత్రాలతో కొత్త కోనేరు సమీపంలో నిర్మించిన ప్రత్యేక మండపం వద్దకు చేరుకుని, పారాయణ వేదికపై ఏర్పాటు చేసిన స్థలంలో రామకోటి ప్రతులను భద్రపరిచారు.
తదుపరి కొండగట్టు అంజన్న సేవా సమితి సభ్యుడు, ఆలయ స్థానాచార్యుడు జితేంద్రప్రసాద్ స్వామి ముందుగా అఖండ హనుమాన్ చాలీసా ప్రాశస్థ్యాన్ని వివరించారు. ప్రసంగాల అనంతరం మంగళశాసనాలతో అఖండ పారాయణ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. పూడూర్కు చెందిన అంజన్న భక్త మండలి, మల్యాలకు చెందిన మఠం ఆంజనేయస్వామి ఆలయ భక్త కమిటీల నేతృత్వంలో తొలిరోజు హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. అక్కడే కవిత పారాయణం చేశారు. పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసిన అర్చకులు, మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి హారతి ఇచ్చారు. అనంతరం రామ సంకీర్తనతో మొదటిరోజు చాలీసాను పూర్తి చేశారు. అనంతరం స్వామివారి మంగళశాసనాలను భక్తులకు అందజేశారు. అనంతరం కవిత రాత్రి 7గంటల తర్వాత కొండగట్టు దిగువకు వచ్చి, బస్టాండ్ సమీపంలోని అంజన్న విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి, జడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్రావు, మల్యాల, కొడిమ్యాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కొండపల్కల రాంమోహన్రావు, పునుగోటి ప్రశాంతి, మిట్టపెల్లి విమల, మెన్నేని స్వర్ణలత, సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.