రూ.90 లక్షలతో అభివృద్ధి పనులు
హరితహారం మొక్కలతో కొత్త కళ
ఆహ్లాదకరంగా పల్లె వనం
అశ్వాపురం, మార్చి 13: వెనుకబాటు నుంచి మల్లెమడుగు పంచాయతీ అభివృద్ధి బాట పట్టింది. నాడు మౌలిక వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. పాలకవర్గం పల్లె ప్రగతి నిధులను సద్వినియోగం చేసుకుని వారికి మౌలిక వసతులు కల్పించింది.. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, రైతువేదికలతో ప్రస్తుతం గ్రామం కళకళలాడుతున్నది..
మల్లెలమడుగు గ్రామం అశ్వాపురం మండలకేంద్రానికి 8.5 కిలో మీటర్ల దూరంలో ఉంది. గతంలో వానొస్తే బురద నిండే రోడ్లు.. నేడు అద్దంలా మెరుస్తున్న వీధులు.. గ్రామంలో 80 శాతం సీసీ, గ్రావెల్ రోడ్లు అద్దంలా మెరుస్తాయి. పంచాయతీ పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో ఏ ఇంటిని చూసినా పరిసరాలన్నీ పరిశుభ్రంగా కనిపిస్తాయి. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుకుతున్నది. గ్రామ శివారులోని గొత్తికోయ ఆవాసానికి మిషన్ భగీరథ నీరందుతుండడం విశేషం.. ప్రజలకు మౌలిక వసతులతోపాటు ఆహ్లాదం పంచే పల్లెప్రకృతి వనం, చివరి మజిలీ ఇబ్బందులు లేకుండా వైకుంఠధామం, చెత్తవేసేందుకు డంపింగ్యార్డు, తడి, పొడి చెత్త వేరు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్డు గ్రామంలో అందుబాటులోకి వచ్చాయి. సర్పంచ్ కోడి కృష్ణవేణి ప్రత్యేక చొరవతో మొండికుంట క్లస్టర్ రైతువేదికను దాతల వద్ద నుంచి స్థలాన్ని సేకరించి రైతులకు ఉపయోగపడేలా రూ.22.5 లక్షలతో మల్లెలమడుగులో రైతువేదికను నిర్మించారు. గ్రామంలో ప్రతి వీధిలో ఎల్ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికి గ్రామంలో 4 వేల మొక్కలు నాటి దాదాపు 90శాతం వాటిని బతికించారు. రైతులు ధాన్యం ఆరబోసేందుకు రాళ్లగుట్టను చదును చేసి యార్డును ఏర్పాటు చేశారు. నెల్లిపాక పీఏసీఎస్ నిధులతో రైతులకు ఉపయోగపడేలా గోదాము నిర్మించారు. గ్రామంలోని గిరిజనకాలనీలో 30 డబుల్ బెడ్రూంలు నిర్మించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సర్పంచ్ కొడి కృష్ణవేణి, ఉపసర్పంచ్ చావా వీరరాఘవులు, పాలకవర్గం సమష్టి కృషితో గ్రామ రూపురేఖలు మార్చారు. పంచాయతీలో నెలకొన్న ప్రతి సమస్యను చొరవ తీసుకొని పరిష్కరిస్తున్నారు.
కల నెరవేరింది..
చెరువు నుంచి పొలాలకు వెళ్లే పంటకాలువ ఒకటి గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఇండ్ల మధ్యలోంచి వెళ్తుంది. వర్షాకాలం వస్తే పంట కాలువ నీరు ఇండ్లలోకి చేరి గ్రామస్తులు ఇబ్బందిపడేవారు. పాలకవర్గం పంట కాలువపై చప్టాతోపాటు ఇండ్లలోకి నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.3 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టింది. మొండికుంట క్లస్టర్కు రైతు వేదిక మంజూరైంది. గ్రామంలో నిర్మాణానికి స్థలం లేకపోవడంతో సర్పంచ్ చొరవ తీసుకొని అదే క్లస్టర్ పరిధి మల్లెలమడుగులోని గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించారు. వారికి సంబంధించిన స్థలాన్ని రైతు వేదికకు దానంగా ఇవ్వడంతో రూ.22 లక్షలతో రైతు వేదికను నిర్మించారు.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం..
పంచాయతీ నిధులను సద్వినియోగం చేసుకుంటున్నాం.. మా పంచాయతీకి జనాభా ప్రాతిపాదికన నిధులు రావడం లేదు. గత పాలకుల నిర్లక్ష్యంతో మా పంచాయతీలో జనాభా గణాంకాలు తప్పుగా నమోదు చేశారు. అయినా ఉన్న నిధులతో సమర్థంగా పని చేస్తున్నాం.