పసుపు బోర్డు ఏర్పాటు ఆలోచనే లేదన్న కేంద్రం
రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తేల్చి చెప్పిన కేంద్ర వ్యవసాయ మంత్రి
ఎంపీ సురేశ్రెడ్డి ప్రశ్నకు నరేంద్ర సింగ్ తోమర్ సూటి జవాబు
తేలిపోయిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాటల గారడి
పసుపు బోర్డు ఏర్పాటు హామీతో నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచిన బీజేపీ
ఏడాదిన్నరగా పసుపు రైతులను మోసగిస్తున్న బీజేపీ
నిజామాబాద్, మార్చి 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :పసుపు రైతులు మరోసారి దగా పడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు హామీతో నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని గెలిచిన భారతీయ జనతా పార్టీ మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనేదీ తమకు లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఇదే విషయాన్ని వెల్లడించారు. నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేశామని, బోర్డు ఏర్పాటు ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని మంత్రి తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు తాను ఎంపీగా గెలిస్తే.. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని అర్వింద్ రైతులకు బాండ్ రాసిచ్చారు. బోర్డు ఆలోచనే లేదంటూ కేంద్రమే స్పష్టంచేసిన నేపథ్యంలో అర్వింద్ తన ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు హామీతో నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని గెలిచిన భారతీ య జనతా పార్టీ మాటలన్నీ అబద్ధాలనేనని తేలిపోయింది. బోర్డు ఏర్పాటు ప్రక్రియ కాదని తెలిసినప్పటికీ రైతులను మాయమాటలతో మోసగించినట్లు స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేనటువంటి అంశాన్ని రైతులకు ఆపాదించి, బోర్డు పేరుతో ఆశ చూపి ఓట్లు వేయించుకున్న బీజేపీ ఏడాదిన్నర కాలంగా పసుపు రైతులను గందరగోళానికి గురి చేస్తూ వచ్చింది. తీరా రాజ్యసభ వేదికగా సాక్షాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖిత పూర్వకంగా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డికి ఇచ్చిన సమాధానంతో ధర్మపురి అర్వింద్ మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. బోర్డు ఇచ్చేది లేదు… పసుపు బో ర్డు ప్రతిపాదనే తమ వద్ద లేదంటూ కేంద్ర ప్ర భుత్వం స్పష్టం చేయడంతో నిజామాబాద్ ఎంపీ పదవికి అర్వింద్ రాజీనామా ఒక్కటే మిగిలిపో యిం దంటూ రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టిన రైతన్నలంతా రాజీనామా చేయాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తుండగా మాటల గారడీతో ఎంపీ అర్వింద్ కాలాన్ని వెల్లదీస్తూ వస్తున్నారు. బోర్డు ఏర్పాటు అంశమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేకపోవడంతో తక్షణమే రాజీనామా చేయాలంటూ పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం ఇచ్చిన జవాబు ఇది..
తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న పసుపు పంట తీరుతెన్నులపై వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వా న్ని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మార్చి 12వ తారీఖున లిఖిత పూర్వకంగా ఎంపీకి సమాధానం ఇచ్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పసుపు పంట గొప్పతనాన్ని వివరించారు. 2019-20లో తెలంగాణలో 55,444 ఎకరాల్లో పసుపు సాగు కాగా 3.86 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. పసుపు రైతులకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎం.ఐ.డి.హెచ్) ద్వారా చేపడుతున్న కార్యక్రమాల సరళిని ఊటంకించారు. మద్దతు ధర అంశంలో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ద్వారా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా వివరించారు. చివరగా పసుపు బోర్డు ఏర్పా టు ప్రశ్నకు జవాబిస్తూ… తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదనే తమ వద్ద లేదంటూ తేల్చి చెప్పారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్ అండ్ ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందంటూ పేర్కొన్నారు. పసుపు పంట ఉత్పత్తి, ఎగుమతులకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు రీజినల్ ఆఫీస్ పని చేస్తుందంటూ వివరించారు. నిజామాబాద్తో పాటు వరంగల్, హైదరాబాద్, ఖమ్మంలో స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయాలు ఉన్నాయంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వకంగా పేర్కొనడం విశేషం.
2017లో ఏం జరిగింది…?
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఏర్పాటు ప్రక్రియ కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమీ కాదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ కల్వకుంట్ల కవిత పోరాటానికి దక్కిన ఫలితమది. నిజామాబాద్ రూరల్ ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 80వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. నిర్మల్ జిల్లాలోనూ పసుపు సాగు జోరుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పండే పసుపు పంటకు కేరాఫ్ అడ్రస్గా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నిలుస్తున్నది. రవాణాకు అనువు గా ఉండే నిజామాబాద్లోనే పసుపు రైతుల మేలు కోసం బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత కర్షకులు గడిచిన రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. రైతుల కోరికను నెరవేర్చేందుకు ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై కవిత తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. పలు మార్లు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి బోర్డు కోసం విన్నవించారు. నాటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2017లో కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించగా నిజామాబాద్ ఎంపీగా కవిత తిరస్కరించారు. అదే ప్రకటనను 2020, ఫిబ్రవరి 5న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో ఎంపీ అర్వింద్ చెప్పించి జూలైలో ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఏర్పాటు చేయించి రైతులను మరోమారు అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం.
అర్వింద్ బాండ్ పేపర్ సారాంశం ఇదిగో…
నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు… నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తున్నాను… అర్వింద్ ధర్మపురి అను నేను, బీజేపీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత, పసుపు బోర్డును గానీ, పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధరను కానీ తీసుకు రాలేని పక్షంలో, నా పదవికి రాజీనామా చేసి రైతు/ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని మాటిస్తున్నాను.
బీజేపీ ఎంపీ ఓ మాట.. కేంద్రం మరో మాట…
క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ చెబుతున్న మాటలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేతలకు పొంతనే లేకుండా పోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కల్లబొల్లి మాటలతో ప్రజలను అయోమయానికి గురి చేసి నవ్వుల పాలైన బీజేపీ నేతల పరువు మరోమారు బజారున పడింది. పసుపు బోర్డు విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన ప్రకటనలకు, కేంద్ర ప్రభుత్వ పెద్దల మాటలకు ఉన్నటువంటి వ్యత్యాసంపై ప్రజలంతా తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నాయకుడు రాంమాధవ్ స్వయంగా ప్రచారానికి వచ్చినప్పుడు పసుపు బోర్డు ఏర్పాటును సీరియస్గా పరిశీలిస్తున్నామని రైతులకు వివరించారు. గెలిపిస్తే బోర్డు తెస్తామంటూ హామీ ఇచ్చాడు. ధర్మపురి అర్వింద్ సై తం రైతులను తన వైపు తిప్పుకునేందుకు గిమ్మిక్కులు చేశారు. ఏకంగా బాండ్ పేపర్ రాసిచ్చి కర్షకులను అడుగడుగునా నమ్మించే ప్రయత్నం చేశారు. అర్వింద్ మాటలను నమ్మిన రైతులంతా బీజేపీని గెలిపించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే సర్కారు బోర్డును విస్మరించింది. ఎంపీ అర్వింద్ సైతం పసుపు బోర్డు ఏర్పాటుకు కనీస ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలువలేదు. పైగా నిజామాబాద్, జగిత్యాల ప్రాంతంలో బోర్డు ఏర్పాటు అంశంపై ఆశలు పెడుతూ సాగదీస్తుండగా కేంద్రం ఒక్కసారిగా నిజాన్ని బట్టబయలు చేయడంతో అర్వింద్ తీరు మరోమారు రైతుల ముంగిట తేటతెల్లమైంది.