పనిగట్టుకొని నాపై ఆరోపణలు చేస్తున్నారు
నెలన్నర నాటి వీడియోను వక్రీకరించారు
కార్యకర్తల సంక్షేమంపై మాట్లాడిన వీడియో అది
నాపై చేసిన ప్రచారాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తా
వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్
వైరా, మార్చి 13: తనను నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ప్రజాహితం కోసమే తాను పనిచేస్తున్నానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను నిత్యం ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తినని, ఎవరినీ శత్రువులుగా భావించనని అన్నారు. అయితే కొంతమంది వ్యక్తులు తనపై నీచమైన ఆరోపణలు చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ‘డబ్బులు ఇవ్వండి.. ఓట్లు కొనండి..’ అంటూ తాను అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను చూసి తీవ్రంగా మనోవేదన చెందానన్నారు. అవి అసత్య కథనాలని అన్నారు. నెలన్నర క్రితం కార్యకర్తల సమావేశంలో తాను మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారని, రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో తాను ఆ మాటలు మాట్లాడానని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్య అన్నారు. ఫిబ్రవరి 1న తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తాను మాట్లాడినప్పుడు.. పార్టీ సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం కార్యకర్తలు తమ కుటుంబాలను వదిలి వస్తుంటారు కాబట్టి ఆ సమయంలో ప్రయాణ ఖర్చులను తాను సొంతంగా ఇస్తానని చెప్పానని అన్నారు. కార్యకర్తల బాగోగులు చూసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, ఓట్ల కోసం తాను డబ్బులు ఇస్తానని శనివారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారని అన్నారు. ఈ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గతంలో పోలీసు శాఖలో విధులు నిర్వర్తించానని, తన సర్వీసులో ఒక్క రిమార్కూ లేదని గుర్తుచేశారు. కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఏఎంసీ చైర్మన్ రోశయ్య, ఎంపీపీ పావని, జడ్పీటీసీ కనకదుర్గ, టీఆర్ఎస్ నేతలు మోహన్రావు, నాగి, డీ.రాజశేఖర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.