తాండూరు, మార్చి 15 : పల్లెలను సమస్య రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో తాండూరు మండలం ఖాంజాపూర్ గ్రామ రూపురేఖలు మారాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు కలిసికట్టుగా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. పరిశుభ్రత, పచ్చదనంతో ఖాంజాపూర్ గ్రామం కళకళలాడుతున్నది. హరితహారంలో నాటిన మొక్కలు, పల్లెప్రకృతి వనం ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. ప్రతి వాడలో అద్దంలా రోడ్లు, రాత్రివేళలో కాంతులు విరాజిల్లుతున్న ఎల్ఈడీ లైట్లతో గ్రామం కొత్త శోభను సంతరించుకున్నది. ముఖ్యంగా గ్రామం 70 శాతం నాపరాతి బండపై ఉండడంతో ఇండ్ల ముందు మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు వీలుకాలేదు. దీంతో ప్రతి ఇంటికి ఒకటి చొప్పున కొంతమంది కలిసి గ్రామంలో ఒక చోట సామూహిక వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకొని వందశాతం మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా అవార్డు సాధించింది.
అభివృద్ధి పరుగులు…
గ్రామంలో రూ.6 లక్షలతో పల్లెప్రకృతి వనం, రూ.2.5 లక్షలతో కంపోస్టుయార్డు, రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, మురుగుకాలువలు, రూ.2 లక్షలతో నర్సరీ, రూ.10లక్షలతో వాటర్ ట్యాంకు, రూ.2.50 లక్షలతో తాగునీటి శుద్ధి కేంద్రం నిర్మించుకున్నారు. అలాగే తడి, పొడి చెత్తను సేకరించేందుకు ట్రైసైకిళ్లు, ట్రాక్టర్ను కూడా సమకూర్చుకున్నారు. ఇప్పటికే పాడుపడిన ఇండ్లు కూల్చి, బావులు పూడ్చి పనికిరాని చెట్ల ను తొలగించారు. ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. గ్రా మంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేం ద్రం పచ్చటి చెట్లమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆకట్టుకుంటున్నాయి. అందులో అన్ని సౌకర్యాలు ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు.