సూర్యాపేట, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : శాసనమండలి ఎన్నికల పోలింగ్ కోసం సూర్యాపేట జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు. నాలుగు నియోజకవర్గాల్లో 61,624 మంది ఓటర్లు ఉండగా 90పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 837మంది అధికారులు, సిబ్బంది, 612మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. జిల్లాలోని మొత్తం 90పోలింగ్ కేంద్రాలు ఉండగా సూర్యాపేటలో 26, కోదాడ 29, హుజూర్నగర్ 24, తుంగతుర్తిలో 11 ఏర్పాటు చేశారు. 180పోలింగ్ బాక్సుల్లో 90 జంబో, మరో 90 సాధారణ బాక్సులున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 16రూట్లు ఏర్పాటు చేసి 19మంది రూట్ అధికారులు, 108చొప్పున రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 216మంది ఓపీఓలతో పాటు 46మంది మైక్రో అబ్జర్వర్లు, 74మంది ఐడెంటిఫికేషన్ అధికారులు, 19మంది సెక్టోరియల్ అధికారులు, 37వెబ్ కాస్టింగ్, 29మంది వీడియోగ్రాఫర్లు, 23 ఫ్లయింగ్ స్కాడ్లు, మరో 23మంది ప్రత్యేక వీడియోగ్రాఫర్లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల నియమాలను పాటించాలి : ఎస్పీ ఆర్.భాస్కరన్
పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎన్నికల నియమావళిని పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద పోలీసు సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100మీటర్ల వ్యవధిలోకి ఇతరులకు అనుమతి లేదని, వాహనాలు, సెల్ఫోన్స్, ఇతర కాగితాలు, పార్టీ గుర్తులు అనుమతించవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు రఘు, మోహన్కుమార్, సీఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. పట్టభద్రులు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: డీఐజీ ఏవీ రంగనాథ్
నీలగిరి, మార్చి 13: ఎన్నికల ప్రశాంతంగా ముగిసేలా పోలీస్ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డీఐజీ, ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచించారు. పోలింగ్ నేపథ్యంలో శనివారం పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు చేర్చడం, ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూంకు తరలించే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అన్ని పోలింగ్స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1117సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. తనతోపాటు ఇద్దరు ఏఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 29మంది సీఐలు, 56మంది ఎస్ఐలు, 124మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, 210మంది కానిస్టేబుళ్లు, 564 మంది మహిళా కానిస్టేబుళ్లు, 126మంది హోంగార్డులు విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ నర్మద, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, సురేశ్, వెంకట్రెడ్డి, ప్రసాద్, నాగరాజు ఆర్ఐలు నర్సింహాచారి, శ్రీనివాస్, కృష్ణారావు పాల్గొన్నారు.
నిర్వహించేలా ఏర్పాట్లు
రిటర్నింగ్ అధికారి పీజే పాటిల్
ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పేర్కొన్నారు. నల్లగిండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ఓటర్లకు వాయిలట్ కలర్ పెన్ను అందజేయాలన్నారు. ఓటర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆయన వెంట నల్లగొండ, ఖమ్మం అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్లు ప్రతిమాసింగ్, వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఆర్వో జగదీశ్వర్రెడ్డి, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, హౌసింగ్ పీడీ రాజ్కుమార్ పాల్గొన్నారు.