సిద్దిపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరిచేన్లు పొట్ట దశలో ఉన్నాయి..! ఈ దశలో కావాల్సినంత నీళ్లు అవసరం..! ఒకవైపు ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి..! ఎక్కడి నీళ్లు అక్కడే ఎండలకు ఇంకిపోతున్నాయి..! గత పక్షం రోజుల నుంచి ఎండలు ముదరడంతో పంట పొలాలకు నీళ్లు ఎక్కువ అవసరపడుతున్నాయి. చెరువుల్లో నీళ్లు రోజురోజుకూ తగ్గుతున్నాయి. దీంతో పంటలు ఎండిపోకుండా కాపాడాలని రైతులు సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు రంగనాయకసాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా తొలిసారిగా యాసంగి పంటలను కాపాడేందుకు గోదావరి జలాలతో చెరువులు కుంటలను నింపుతున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి జగదేవ్పూర్, మర్కూక్ మండలాల్లోని చెరువులను నింపనున్నారు. మండుటెండల్లో సైతం చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. కొన్నింటికి పిల్ల కాల్వలు లేవు.. ఎక్కడికక్కడి నీళ్లు విడిచి పెడితే, కొంత మంది రైతుల పంట పొలాలకు నష్టం జరిగే ప్రమాదం ఉండడంతో నీళ్లు సాఫీగా వెళ్లే చెరువులకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. తొలిసారి యాసంగి పంటకు గోదావరి జలాలు అందుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు తపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
అలుగు పారుతున్న చెరువులు..
జిల్లాలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా చెరువులు అలుగుపారుతున్నాయి. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి ఇప్పటి వరకు 0.42 టీఎంసీల నీటిని వదిలారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 1.58 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మండుటెండల్లో చెరువులు నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పలు చెరువులు మత్తళ్లుపోస్తున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలంలోని 11చెక్డ్యాంలు, 23చెరువులు నిండాయి. నంగునూరు మండలంలోని 4చెక్డ్యాంలు, 3చెరువులు, సిద్దిపేట అర్బన్ మండలంలోని 9చెక్డ్యాంలు, నారాయణరావుపేట మండలంలోని 16చెక్డ్యాంలు, 8చెరువులు మొత్తంగా 40చెక్డ్యాంలు, 34చెరువులు అలుగుపారుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో మరిన్ని చెరువులు అలుగుపారనున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో 2చెరువులు, దుబ్బాక మండలంలో 4చెరువులు నిండాయి. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్కు వెళ్లే ప్రధాన కాల్వ ద్వారా తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి తొగుట, దుబ్బాక మండలాలకు గోదావరి జలాలు పరగులు పెడుతున్నాయి.