గ్రామాభివృద్ధికి నడుం బిగించిన మహిళా సర్పంచ్
మారుతున్న ‘మల్లారం’ రూపురేఖలు
పల్లె ప్రగతి పనుల్లో పంచాయతీ ముందంజ
తల్లాడ, ఫిబ్రవరి 19: 90 ఏళ్ల వృద్ధాప్యంలోనూ గ్రామ పంచాయతీని ప్రగతిపథంలో నడిపించాలనే సర్పంచ్ పట్టుదలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి ఎంతో ఉపకరించింది. 67 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీగా ఏర్పాటైనప్పటికీ ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండేళ్లలోనే ఆ గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. అదే.. తల్లాడ మండలం మల్లారం (మల్లవరం) గ్రామం. పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక సౌకర్యాలతో ఆ గ్రామ రూపురేఖలు మారాయి.
ఇదీ పంచాయతీ నేపథ్యం
1952లో మల్లారం గ్రామ పంచాయతీ ఏర్పాటైంది. దీని పరిధిలో మల్లారం, దుగ్గిదేవర నర్సయ్యనగర్, లక్ష్మీనగర్, గంగదేవిపాడు గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ జనాభా 4,117, ఓటర్లు 3,210 ఉన్నారు. నివాస గృహాలు – 1183 ఉన్నాయి. 90 ఏళ్ల వృద్ధురాలైన సర్పంచ్ దుగ్గిదేవర సామ్రాజ్యం రాష్ట్రంలోనే సర్పంచ్ల్లో అత్యధిక వయస్సు ఉన్న వారు కావడం విశేషం.
అభివృద్ధిలో ముందడుగు..
పల్లెప్రగతికి విడుదలవుతున్న నిధులతో పాలకవర్గ సభ్యులు ఆమోదించిన అభివృద్ధి పనులను వెనువెంటనే చేపట్టారు. వైకుంఠదామం, డంపింగ్యార్డు, రైతువేదిక, సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. రెండు పల్లె ప్రకృతి వనాలను, ఒక నర్సరీని నిర్వహిస్తున్నారు. మూడు రోజులకోసారి ట్రాక్టర్ ద్వారా నివాస గృహాల నుంచి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. పల్లెప్రకృతివనాలోని మొక్కలకు, హరితహార మొక్కలకు ట్యాంకర్ ద్వారా నిత్యం నీళ్లు పడుతున్నారు. ఫలితంగా మొక్కలు పచ్చదనాన్ని పంచుతున్నాయి.
మెరుగుపడుతున్న పల్లె..
‘పల్లె ప్రగతి కార్యక్రమం పంచాయతీల పాలిట వరం. గతంలో నేను ఒకసారి సర్పంచ్గా, రెండు సార్లు ఎంపీటీసీగా పనిచేశాను. ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా ప్రస్తుతం పల్లెప్రగతి వల్ల పంచాయతీలకు నిధులు విడుదలవుతున్నాయి. దీంతో మా గ్రామం దినదినాభివృద్ధి చెందుతోంది. విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు వేశాం. అభివృద్ధిలో మల్లారం రూపురేఖలు మారాయి.’