గంభీరావుపేట, మార్చి 17: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శృంగేరి జగద్గురు భారతీతీర్థ స్వామి సప్తతి(70) మహోత్సవాలు హరిహర దేవాలయంలో బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శతచండీ యాగంలో భాగంగా మొదటి రోజు గురుదేవతా ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ, చండీ యంత్ర స్థాపన, సప్తశతీ పారాయణం, కుంకుమార్చన, కన్యకా పూజ, నవాక్షరీ మూల మంత్ర అనుష్టానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాగాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మరో నాలుగు రోజులపాటు యాగం నిర్వహిస్తామని నిర్వాహకులు వ్యాసోజ్జల రామశర్మ, దేశపతి సుదర్శనశర్మ, వ్యాసోజ్జల రాధాకృష్ణ శర్మ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దొంతినేని చైతన్య, ఉపసర్పంచ్ దుబాసి రాజు, ఎంపీటీసీ బిందె రేణుక, ఏఎంసీ మాజీ చైర్మన్ లింగన్నగారి దయాకర్రావు పాల్గొన్నారు.