విపంచి కళానిలయంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 07 : నేతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ చేనేత కార్మికులు, కళాకారులను సన్మానించారు. చేనేత మిత్ర కింద చేనేత సంఘాలకు రూ.25లక్షల త్రిఫ్ట్ ఫండ్ను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి విపంచి ఆడిటోరియం వరకు నిర్వహించిన చేనేత నడక కార్యక్రమాన్ని జడ్పీ చైర్ పర్సన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సిద్దిపేట గొల్లభామ చీరెలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం బతుకమ్మ చీరెలు, చేనేత మిత్ర కింద నూలు, రసాయనాలు, రంగులను 50శాతం సబ్సిడీతో పాటు కార్మికులకు చేతినిండా పని కల్పించి భరోసానిస్తుందన్నారు. మంత్రి హరీశ్రావు సన్మాన కార్యక్రమాల్లో చేనేత వస్ర్తాలతో సత్కరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో చేనేత వస్ర్తాలను ధరిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు వెంకట రమణ, డీఆర్డీవో గోపాల్రావు, మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులరాజనర్సు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.