నిజామాబాద్, మార్చి 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉత్తర తెలంగాణకు వర ప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.. భౌగోళికంగా నిజా మాబాద్ జిల్లాలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2014 నాటికి ఈ ప్రాంత ప్రజలకు చేకూరే ప్రయోజనం శూన్యం. సమైక్య పాలనలో ఎంతసేపు గోదావరి నీళ్లను దిగువకు తీసుకుపోవడమే తప్ప, ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో నీళ్లిచ్చే ఆలోచనే చేయలేదు. నీళ్లను పల్లపు ప్రాంతానికి తరలించడమే తప్ప ఎదురెక్కించి చిన్నపాటి లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసి బాల్కొండ నియోజకవర్గంలోని భూములను తడిపే ఆలోచన గతంలో ఎవరూ చేయలేదు. రాష్ట్రం లో కాళేశ్వరం లాంటి అద్భుతమైన పథకానికి రూప కల్పన చేసిన సీఎం కేసీఆర్.. అదే స్ఫూర్తితో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు నాంది పలికారు. కాళేశ్వరం నీటిని వరద కాలువ మీదుగా ఎదురెక్కించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపడమే ధ్యే యంగా పునరుజ్జీవ పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టా రు. ఉద్యమ నాయకుడి ఆలోచనలను అమలుచేస్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చారిత్రక ప్రాజెక్టుకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. చిన్నపాటి లిఫ్ట్లతో వేలాది ఎకరాలకు ప్రాణం పోస్తున్నారు.
గోదావరి మురిసేలా…
వానకాలం దాటిందంటే కందకుర్తి నుంచి మొదలు కుని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు గోదావరి నదీ తీరమంతా ఇసుక మేటలతో తిష్ట వేసేది. ఎగువ మహారాష్ట్రలో కట్టిన అక్రమ కట్టడాలతో చుక్కా నీరు దిగువకు రాకపోవడంతో జీవ నది కళావిహీనమై దర్శన మిచ్చేది. దీంతో ఎస్సారెస్పీ బోసి పోయి కని పించేది. ఈ దుస్థితిని మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో సీఎం కేసీఆర్ ఆలోచనలో నుంచి పుట్టిన పునరుజ్జీవ పథకంతో ఎస్సారెస్పీకి కొంగొత్త ఊపిరి పోశారు. శ్రీరాంసాగర్ నీటిని దిగువకు మోసుకుపోయేందుకే నిర్మించిన వరద కాలువనే ఆయుధంగా మార్చుకున్నారు. కొత్తగా ఎలాంటి కాలువ నిర్మాణాలు చేపట్టకుండా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో కాళేశ్వరం నీటిని ఎదురెక్కించడం ఇందులోని గొప్పతనం. సీఎం ఆలోచనలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేస్తూ ఆరంభానికి ముందే పునరుజ్జీవ పథకం ఫలాలను ఈ ప్రాంత ప్రజల అనుభవంలోకి తీసుకువచ్చారు. గతేడాది ఎండాకాలంలోనూ ఎస్సారెస్పీలో 30 టీఎంసీల నీటి నిల్వ ఉండడం రికార్డు కాగా… గోదావరిలో జలకళ కనిపించడమూ విచిత్రమే.
వృథా నీటిని ఒడిసి పట్టి…
సీఎం కేసీఆర్ జల నిఘంటువు. ఆయన చెంత రాజకీయ పాఠాలు నేర్చుకున్న మంత్రి వేముల తన నియోజకవర్గాన్ని అదే స్ఫూర్తితో అభివృద్ధి చేస్తు న్నారు. నీటిని వృథా చేయకూడదనే ప్రాథమిక సూత్రాన్ని సీఎం నుంచి స్వీకరించిన ఆయన వాగులు, వంకలపై అనేక చెక్డ్యామ్లను నిర్మించేందుకు పూనుకున్నారు. అవకాశం ఉన్న ప్రతి చోటా ఆనకట్టలు నిర్మించి వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో ఆయా వాగులపై 24 చెక్డ్యాములను దాదాపుగా రూ.100 కోట్లతో నిర్మించగా.. భూగర్భ జలాలు అమాంతం పెరిగేందుకు దోహదపడ్డాయి. బోరు బావుల మీద ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతులకు పరోక్షంగా మేలు చేకూర్చారు. గతంలో వాగుల గుండా వరద నీరంతా గోదావరి నదిలో కలిసేది. ఇప్పుడు ఆనకట్టలతో వాగుల్లో జలకళ సంతరించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చిన్న లిఫ్టులకు మోక్షం…
బాల్కొండ నియోజకవర్గంలో చిన్నపాటి లిఫ్టులతో నీళ్లను మళ్లిస్తే వేల ఎకరాలకు ప్రాణం వచ్చే పరిస్థితి ఉన్నా గతంలో ఎవరూ చొరవ తీసుకోలేదు. మంత్రి వేముల తన నియోజకవర్గంలో బీడు భూములు లేకుండా చేయాలనే తపనతో పాటుపడ్డారు. ప్రతి మండలంలో సాగు నీరు అందించడమే లక్ష్యంగా మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్లకు ప్రణాళికలు రచించారు. వేల్పూర్, మోర్తాడ్, బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో పదుల సంఖ్యలో లిప్టులు అందుబాటులోకి తేవడంతో సుమారుగా 10వేల పాత, కొత్త ఆయకట్టుకు ఊపిరి పోసినట్లు అయ్యింది. ఇందుకోసం రూ.46.99 కోట్లు వెచ్చించారు. మోతె, అంక్సాపూర్, తొర్తి, పాలెం, జలాల్పూర్, నాగేపూర్, పల్లికొండ, బస్సాపూర్, కుకునూరు, గుమ్మిర్యాల్లో ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి తేవడంతో పంటల సాగుకు ఢోకా లేకుండా పోయింది.
ఆపదలో అన్నలా…
ఉద్యమ భావజాలం, కేసీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వేముల ప్రశాంత్ రెడ్డి అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. తొలి విడుత ప్రభుత్వంలో మిషన్ భగీరథకు వైస్ చైర్మన్గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. మలి విడుత సర్కారులో కేసీఆర్ క్యాబినెట్లో కీలకమైన శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లుంబిని పార్కులో నిర్మిస్తున్న అమరవీరుల స్మృతి చిహ్నం, నూతన సచివాలయ నిర్మా ణం వంటి కట్టడాలు వేముల నేతృత్వంలోనే సాగుతుండడం విశేషం. మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ నిత్యం ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి పేరిట పలు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల కోసం వైకుంఠరథం, నాలుగు ప్రభుత్వ దవాఖానల్లో ఫ్రీజర్లు, గిఫ్ట్ ఏ స్మైల్ కింద రూ.20లక్షలతో అంబులెన్సును అందుబాటులోకి తెచ్చి తన ఉదారతను చాటుకున్నారు.