అధికారులను ఆదేశించిన కలెక్టర్ రవి
జగిత్యాల, ఏప్రిల్ 26: జిల్లాలో కొవిడ్ చికిత్సకు అవసరమైన మేరకు అదనపు బెడ్లు, సాధారణ, ఐసీయూ, ఆక్సిజన్ ఏర్పాటు చేసుకోవాలని, కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ జరిగి దవాఖానల్లో చికిత్స తీసుకునే వారికి అవసరమయ్యే ఆక్సిజన్ నిల్వలు సరిపడా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జీ రవి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో జిల్లాలో కొవిడ్ యాక్టివ్ కేసులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అవసరం మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ వార్డుల (బెడ్ల) సంఖ్యను వీలైనన్ని ఎక్కువగా పెంచాలని, ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ చికిత్స, టెస్టులు, వసూలు చేస్తున్న ఫీజులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
జిల్లాలో ఉన్న హాస్పిటళ్లలో బెడ్ల వివరాలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఆన్లైన్లో తెలియజేయాలని ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారికి సరైన వసతులు లేని వారిని జేఎన్టీయూలోని ఐసొలేషన్ కేంద్రానికి తరలించాలని పేర్కొన్నా రు. కొవిడ్ కంట్రోల్ రూం ద్వారా పాజిటివ్ కేసులపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. అవసరం మేరకు తా త్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని, దవాఖానల్లో 48గంటల ఆక్సిజన్ నిల్వలు ఉండేలా పర్యవేక్షించాలన్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకు ని ర్వహిస్తున్న కర్ఫ్యూ అమలు కచ్చితంగా జరగాలని, అనవసరంగా ప్రజలు సమూహంగా ఏర్పడకుండా చూడాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవోలు, జిల్లా వైద్యాధికారి, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.