రేపు, ఎల్లుండి న్యాక్ బృందం సందర్శన
ఇప్పటికే రెండుసార్లు బీ గ్రేడ్
మొదటిరోజు పూర్వ విద్యార్థులతో సమావేశం
రెండో రోజూ వివిధ వసతులపై ఆరా
ఏ గ్రేడ్ వస్తే అందనున్న రూ.5 కోట్ల నజరానా
ఆదిలాబాద్ రూరల్, మార్చి 13: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు, ఎల్లుండి న్యాక్ బృందం సభ్యులు పర్యటించనున్నారు. ఇప్పటికే గతంలో రెండు సార్లు సభ్యులు పర్యటించి కాలేజీకి బీ గ్రేడ్ ఇచ్చారు. ఈ సారి ఏ గ్రేడ్ సాధించేందుకు అధ్యాపకులు ప్రయత్నిస్తున్నారు. ఏ గ్రేడ్ వస్తే కళాశాలకు గుర్తింపుతోపాటు భారీ మొత్తంలో నిధులు అందనున్నాయి. కాగా.. విద్యార్థులు, అధ్యాపకుల సామర్థ్యం, మౌలిక వసతులను పరిశీలించి గ్రేడ్ను ప్రకటించనున్నారు. ఆరు దశాబ్దాలుగా ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దిన కళాశాలకు ఈసారి ఏ గ్రేడ్ వస్తుందని అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ శాంతినగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటిది. గతంలో ఇందులో వేలాది మంది చదువుకొని నేడు అత్యున్నత పదవుల్లో ఉన్నారు. రాజకీ యం, ఇంజినీరింగ్, వైద్యం ఇలా అనేక రంగాల్లో ఈ కళాశాలలో చదివిన వారు ఉన్నారు. 1957లో సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలగా దీన్ని ఏర్పాటు చేశారు. 2019లో సైన్స్ డిగ్రీ కళాశాలగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ మంత్రి సీఆర్ఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ జీ నగేశ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు చంద్రయ్య, చంద్రకుమార్ ఈ కళాశాలలోనే చదివారు. ప్రస్తుత ప్రిన్సిపాల్ ప్రతాప్సింగ్ కూడా ఇక్కడే చదివారు. కళాశాలలో 23 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 277, ద్వితీయ సంవత్సరంలో 290, తృతీయ సంవత్సరంలో 306 మంది చదువుతున్నారు. ప్రస్తుతం బీజడ్సీ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియాల్లో, ఎంపీసీ, ఎంపీసీఎస్లు ఇంగ్లిష్ మీడియంలో నడుస్తున్నాయి. సుమారు 15 ఎకరాల సువిశాల స్థలంలో కళాశాల ఏర్పాటు కావడంతో నేటి అవసరాలకు తగ్గట్లుగా కళాశాలలో నూతన భవనాలు, మైదానం, ఎన్సీసీ పరేడ్ మైదానం, గార్డెన్ ఏర్పాటు చేశారు. మొత్తం 56 తరగతి గదులు అందుబాటులో ఉండగా, వీటిలో కెమిస్ట్రీ, బాటనీ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లిష్ ల్యాబ్, టీఎస్కేసీ, క్యాంటీన్ ఉన్నాయి. ఇవే కాకుండా కళాశాల విద్యార్థుల కోసం సువిశాలమైన ఆటస్థలం అందుబాటులో ఉంది. దీనికి తోడు యువతకు రెండు ఎన్సీసీ యూనిట్లు, ఎన్ఎస్ఎస్లలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా విద్యార్థులు పాఠ్యాంశాలను వినడానికి అవసరమైన వర్చువల్ ఇంటర్నెట్ కూడా కళాశాలలో అందుబాటులో ఉంది.
రెండు సార్లు బీ గ్రేడ్..
కళాశాలలో ఉన్న వసతుల ఆధారంగా 2006, 2014ల్లో న్యాక్ బృందం( నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) బీ గ్రేడ్ ఇచ్చింది. ఈ సారి ఎలాగైనా ఏ గ్రేడ్ సాధించాలనే ఉద్దేశంతో ప్రిన్సిపాల్, సిబ్బం ది కృషి చేస్తున్నారు. ఇప్పటికే కళాశాలను పూర్తిగా తీర్చిదిద్దారు. ఈ నెల 15,16తేదీల్లో న్యాక్ బృందం రానుండడంతో ఎలాంటి లోపాలు లే కుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం పూర్వ విద్యార్థుల సహా యం తీసుకుంటున్నారు. విద్యార్థుల వాహనాలు నిలపడానికి ఎమ్మెల్యే జోగు రామన్న షెడ్ను మంజూరు చేయగా, పూర్వ విద్యార్థుల కమిటీ రూ.50వేలతో కళాశాల ప్రాంగణంలో పార్కును ఏర్పాటు చేసింది. ఇలా న్యాక్ బృందం వచ్చేలోగా కళాశాలను సుందరంగా తీర్చిదిద్దడా నికి అధ్యాపకులు, ప్రిన్సిపాల్ కష్టపడుతున్నారు. గతంలో బీ గ్రేడ్ వచ్చిన సందర్భంగా రూసా(రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) నుంచి కళాశాల అభివృద్ధికి రూ.2కోట్లు మంజూరయ్యాయి.
ఏ గ్రేడ్ కోసం ప్రయత్నం..
గతంలో రెండు సార్లు బీ గ్రేడ్ సాధించిన కళాశాల ఈ సారి న్యాక్ తనిఖీల్లో ఏ గ్రేడ్ సాధించాలనే పట్టుదలతో ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఉన్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. గతంలో రూసా విడుదల చేసిన నిధులతో నాలుగు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఏ గ్రేడ్ సాధిస్తే జాతీయ స్థాయిలో కళాశాలకు గుర్తింపు రావడంతో పాటు, రూ.5కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా న్యాక్ బృందం పూర్వ విద్యార్థులతో సమావేశం కానుంది. రెండో రోజు కళాశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల సామర్థ్యాలను, టెక్నాలజీ ఉపయోగిస్తున్నరా లేదా అనే విషయాలపై ఆరా తీయనున్నారు. డిజిటల్ తరగతులు ఉన్నాయా..లేదా అనే విషయాలను పరిశీలిస్తారు.