రేపటి నుంచి కొండగట్టుపై హనుమాన్ చాలీసా పఠనం
రెండు మండలాల కాలం పాటు..
జూన్ 4న రామకోటి స్తూపానికి ప్రతిష్ఠాపనోత్సవం
వారానికో ఉమ్మడి జిల్లాలో ఉత్సవ విగ్రహంతో రథయాత్ర
కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో మహత్తర కార్యక్రమం
జగిత్యాల, మార్చి 15 (నమస్తే తెలంగాణ)/మల్యాల : అవనిపై ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించి, మనిషిని శారీరక, మానసిక ఆరోగ్యవంతుడిగా మార్చేందుకు ఉద్దేశించిందే హనుమాన్ చాలీసా పారాయణం. మనిషి తన శారీరక, మానసిక రుగ్మతల నుంచి బయట పడేందుకు భగవంతుడిని తదేకంగా ధ్యానించడమే ఏకైక మార్గం. అలాంటి ఒక ఆధ్యాత్మికతను పెంచేందుకు రేపటి నుంచి కొండగట్టుపై అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభం కాబోతున్నది. రెండు మండలాల (82రోజులు) పాటు కొనసాగిన తర్వాత రామకోటి స్తూప ప్రతిష్ఠాపనోత్సవం చేపట్టనుండగా, అందుకు కొండగట్టు అంజన్న సేవా సమితి అంతా సిద్ధం చేస్తున్నది.
ఈ నెల 18న హనుమాన్ చిన్న జయంత్యుత్సవాల సందర్భంగా హనుమాన్ దీక్షా స్వీకారోత్సవాలు మొదలై, హనుమాన్ పెద్ద జయంతి జూన్ 4వ తేదీ వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఈ సందర్భంగా కొండగట్టు పుణ్యక్షేత్రంపై ఈ నెల 17 నుంచి రెండు మండలాల కాలం పాటు (82 రోజులు) అఖండ హనుమాన్ చాలీసా పారాయ ణం నిర్వహించనున్నారు. పారాయణం ప్రారంభించే రోజు ఉదయం ఐదు కోట్ల రామనామ లిఖిత ప్రతులతో దిగువ కొండ నుంచి కొండగట్టు పైకి శోభాయాత్ర నిర్వహించనున్నారు. తర్వాత వాటిని స్వామి సన్నిధిలో ఉంచి అర్చన చేయనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.. కొండపై భక్తులు, అర్చకులు కలిసి పదకొండు సార్లు పారాయణం చేస్తారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాల్లోనూ పారాయణం చేయాలని కొండగట్టు అంజన్న సేవా సమితి పిలుపునిచ్చింది. కొండపై నిత్యం నిర్వహించే పారాయణాన్ని భక్తి చానళ్ల ద్వారా గంటపాటు ప్రసారం చేసేందుకు నిర్ణయించింది. భక్తులు తమ ఇండ్లలోనూ పారాయణం చేయాలని సూచించింది.
దక్షిణాన తొలి రామకోటి స్తూపం..
దక్షిణ భారతదేశంలోనే తొలి రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించాలని కొండగట్టు అంజన్న సేవా సమితి సభ్యులు సంకల్పించారు. 90 లక్షల వ్యయంతో అత్యద్భుతంగా 23 అడుగుల ఎత్తుతో కొండపైన నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 9న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణరెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో కలిసి భూమిపూజ చేశారు. స్థపతి సైతం స్థలాన్ని పరిశీలించి నమూనాను రూపొందించారు. రెండు, మూడు రోజుల్లో స్తూప నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు. ఇటు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 5 కోట్ల రామ నామ లిఖితాలు ఉండగా, వీటన్నింటినీ కొండగట్టుపైకి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పారాయణం జరిగే 82 రోజుల వ్యవధిలో మరో 6 కోట్ల రామనామ లిఖిత ప్రతులను భక్తుల నుంచి సేకరించనున్నారు. జూన్ 4న హనుమాన్ పెద్ద జయంతి రోజు మొత్తం 11 కోట్ల రామకోటి లిఖిత ప్రతులతో స్తూపాన్ని ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పది ఉమ్మడి జిల్లాలకు ఉత్సవ విగ్రహం..
రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం సృష్టిం చి, విశ్వమానవ కల్యాణం, లోకా సమస్త సఖినోభవంతు నానుడిని నిలబెట్టేందుకు పూర్వ ఉమ్మడి పది జిల్లాల్లో అంజన్న ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించాలని కొండగట్టు అంజన్న సేవా సమితి నిర్ణయించింది. చాలీసా పారాయణం ప్రారంభమైన తర్వాత ప్రత్యేక రథంపై అంజన్న ఉత్సవ విగ్రహాన్ని ఉంచి, వారానికో ఉమ్మడి జిల్లాలో రథయాత్ర నిర్వహించనున్నారు. రథయాత్ర సందర్భంగా హనుమాన్ చాలీసాను పంపిణీ చేయడం, స్వామివారి తీర్థ ప్రసాదాన్ని భక్తులకు అందజేయడం, ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడం, భక్తులు రాసిన రామకోటి ప్రతులను స్వీకరించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు.