పెరుగుతున్న కరోనా కేసులు.. టీకా ముమ్మరం
ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,90,239 మందికి టీకా
111 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
సిద్దిపేట జిల్లాలో 39 కేంద్రాల్లో 1,26,410 మందికి
సంగారెడ్డిలో 48 కేంద్రాల్లో 97,268, మెదక్లో 24 కేంద్రాల్లో 66,561 మందికి పూర్తి
అందుబాటులో బెడ్లు..పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్రావు
మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో గస్తీ
పక్కాగా రాత్రి కర్ఫ్యూ అమలు
సిద్దిపేట, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారిపై పోరుకు టీకా అస్ర్తాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. 45 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మే 1 నుంచి 18 ఏండ్ల పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 111 కేంద్రాల్లో టీకా ఇస్తుండగా, టీకా తీసుకోవడానికి ప్రజలు ముందుకు వస్తుండడంతో సెంటర్లలో సందడి నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నెల 20 వరకు మొదటి డోస్ టీకా 2,63,283 మంది, రెండోడోస్ 26,956 మంది తీసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడు రోజుల్లో 3,037 కేసులు నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తున్నది. కొవిడ్ కేర్ సెంటర్స్లో మొత్తం బెడ్స్ 450 అందుబాటులో ఉన్నాయి. కాగా, జిల్లాకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దున ఉండడంతో అక్కడి నుంచి రాకపోకలు సాగించకుండా చెక్పోస్టులు, కంచెలు ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారు. అన్నిచోట్ల రాత్రి కర్ఫ్యూ పక్కాగా అమలవుతున్నది.
జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టీకా తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. టీకా తీసుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండడంతో ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలకు సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్పై మంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల నంగునూరు మండలం రాజగోపాల్పేట వ్యాక్సినేషన్ సెంటర్ను మంత్రి తనిఖీ చేశారు. స్థానిక సెం టర్ల వద్ద ఏర్పాట్లపై అక్కడి నుంచే మంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి టీకా ఇస్తున్నారు. వారం రోజులుగా అన్ని వ్యాక్సిన్ సెంటర్ల వద్ద జనం పెరిగారు. 45 ఏండ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. మే 1 నుంచి 18 ఏండ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
జోరందుకున్న వ్యాక్సినేషన్…
సిద్దిపేట జిల్లాలో 38, ప్రైవేట్లో 1, మెదక్ జిల్లాలో 24, సంగారెడ్డి జిల్లాలో 41, ప్రైవేట్లో 7 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి కరోనా టీకా ఇస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 20వ తేదీ వరకు డోస్-1 తీసుకున్న వారు 2,63,283, డోస్-2 తీసుకున్నవారు 26,956, మొత్తం 2,90,239 ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 1,26,410 మొత్తం వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వీరిలో 1,15,820 మంది ఒకటో డోస్, 10,590 మంది రెండో డోస్ తీసుకున్నారు. మెదక్ జిల్లాలో 66,561 మంది వ్యాక్సిన్ తీసుకోగా, వీరిలో 60,910 మంది మొదటి డోస్, 5,651 మంది రెండో డోస్ వేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 97,268 మంది వ్యాక్సిన్ వేయించుకోగా, వీరిలో 86,553 మంది మొదటి డోస్, 10,715 మంది రెండో డోస్ తీసుకున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడు రోజుల్లో 3,037 కేసులు…
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,037 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 1,563 నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో 840, మెదక్ జిల్లాలో 634 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 103 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ సెంటర్స్ను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దవాఖానలో 8 చోట్ల అందుబాటులో ఉంచారు. ఆర్టీపీసీ సెంటర్స్ సిద్దిపేట జిల్లాలో 38, సంగారెడ్డి జిల్లాలో 39, మెదక్ జిల్లాలో 24 చోట్ల, ఇవి కాకుండా మైకో కంటోన్మెంట్ జోన్స్ మెదక్ జిల్లాలో 7, సంగారెడ్డి జిల్లాలో 1 అందుబాటులో ఉన్నాయి. కొవిడ్ కేర్ సెం టర్స్ మొత్తం బెడ్స్ 450 అందుబాటులో ఉన్నాయి. వీటిలో సిద్దిపేట జిల్లా (బాబూ జగ్జీవన్రాం హాల్) 100 బెడ్స్, మెదక్ జిల్లా ( డబుల్ బెడ్రూం పిల్లికొట్ల )100 బెడ్స్, సంగారెడ్డి జిల్లా (నారాయణ జూనియర్ కళాశాల, పాటిఘనపూర్ పటాన్చెరు) 250 బెడ్స్ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.