గాంధారి మార్చి 15 : మారుమూల తండాలు సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతిని ప్రవేశపెట్టింది. చిన్న, పెద్ద పంచాయతీలు అనే తేడా లేకుండా అభివృద్ధి పనుల కోసం పుష్కలంగా నిధులను విడుద ల చేస్తున్నది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుడి వెనుక తండాలో మాత్రం పల్లె ప్రగతి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. తండా శివారులో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు ముందుకు సాగడం లేదు. వైకుంఠధామం పనులు చేపట్టిన స్థలం ఎత్తుపల్లాలతో పాటు, పెద్ద పెద్ద బండరాళ్లతో ఉండగా కాంట్రాక్టర్ స్థలాన్ని చదును చేయకుండానే పనులను ప్రారంభించారు. దహన సంస్కారాలు నిర్వహించడానికి వీలులేకుండా వైకుంఠధామం నిర్మిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం పనులు సైతం మధ్యలోనే నిలిచిపోయాయి. స్నానపు గదులపై కప్పు పూర్తి కాలేదు. తండాలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, పెంటకుప్పలు దర్శనమిస్తున్నాయి. కంపోస్టు షెడ్డు పూర్తయినప్పటికీ నిరుపయోగంగానే ఉంది. తండాకు వెళ్లే దారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పశువులు మేయడంతో ఎండిపోయాయి.