కొవిన్ పోర్టల్, ఆరోగ్యసేతులలో నమోదు ప్రక్రియ
18 ఏండ్లు నిండిన వారందరూ అర్హులు
ఇక నుంచి స్లాట్ బుక్ చేసుకున్న వారికే..
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2.55 లక్షల మందికి టీకా
మీకు 18 ఏండ్లు నిండాయా?
ఆదిలాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :టీకా వేసుకోవాలనుకుంటున్నారా? కేంద్రాల వద్ద చాలా మంది ఉంటున్నారని ఆలోచిస్తున్నారా? ఏ టీకా వేసుకోవాలి? మీరు కోరుకున్న చోటే వేసుకోవాలని భావిస్తున్నారా? అయితే.. మీ కోసమే సర్కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం కొవిన్ పోర్టల్, ఆరోగ్య సేతులను అందుబాటులో ఉంచింది. వీటిలో వివరాలు నమోదు చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీరు కోరుకున్న రోజున, సమయానికి వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటు ఉంది. బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మే 1 (శనివారం) నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే టీకా వేస్తారని అధికారులు వెల్లడించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ను నియత్రించేందుకు సర్కారు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకా వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రెండో విడుత పంపిణీ కొనసాగుతున్నది. 45 ఏండ్లు దాటిన వారందరికీ ఈ నెల 1 నుంచి వేస్తున్నారు. మొదటి విడుతలో భాగంగా 60 ఏండ్లు దాటిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏండ్లు దాటిన వారికి అధికారులు పంపిణీ చేయగా.. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2.55 లక్షల మందికి వైద్యశాఖ అధికారులు వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 106 కేంద్రాల్లో పంపిణీ జరుగుతున్నది. 45 సంవత్సరాలు నిండిన వారు తమ ఆధార్కార్డు తీసుకుని టీకా కేంద్రాలకు వెళ్తే వైద్య సిబ్బంది వారి వివరాలను నమోదు చేసుకొని వ్యాక్సిన్ ఇస్తున్నారు. మే 1(శనివారం) నుంచి మూడో విడుత టీకా పంపిణీకి 18-44 ఏండ్లు ఉన్న వారందరూ అర్హులు కాగా వారు కొవిన్, ఆరోగ్యసేతు యాప్లలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. బుధవారం సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకాకు అధిక మంది వచ్చే అవకాశాలున్నందున.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన వారు 19 లక్షల వరకు ఉంటారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టీకా తీసుకోవాలంటే కొవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
కొవిన్ పోర్టల్లో www.cowin.gov.in లో లాగిన్ అవ్వాలి. టీకా తీసుకునే వారి మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని వైరిఫై చేసిన తర్వాత ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఇతర ఫొటో ఐడీని ఫ్రూప్ కోసం ఎంచుకోవాలి. పేరు, వయస్సు, లింగ నిర్ధారణ ఇతర వివరాలు నమోదు చేసి ఐడీ ప్రూప్ అప్లోడ్ చేయాలి. అనంతరం రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికా గానే పేజీలో అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్కోడ్ ఆధారంగా టీకా కేంద్రాలు ఎంపిక చేసుకోవచ్చు. ఆరోగ్యసేతు యాప్లో హోం పేజీలోని కొవిన్ ట్యాబ్పై క్లిక్ చేయగానే నాలుగు అప్షన్లు వస్తాయి. ఇందులో వ్యాక్సినేషన్ ట్యాబ్పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రర్ నౌ క్లిక్ చేయాలి. మొబైల్ నంబరు ఎంటర్ చేసిన తర్వాత కొవిన్ యాప్ మాదిరి వివరాలు నమోదు చేసుకోవాలి.