కరీంనగర్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : కట్ల శ్రీనివాస్ది కరీంనగర్లోని మధురానగర్ (52). ఆయనకు 18 ఏళ్ల వయసులో కండరాల క్షీణత (మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధి బయట పడింది. ఇది రెండు లక్షల మందిలో ఒకరికి సోకుతుంది. ఆ అరుదైన వ్యాధితో 32 ఏండ్ల నుంచి బాధపడుతూ, ఇంటికే పరిమితమయ్యాడు. కొడుకును పట్టుకొని తల్లిదండ్రులు అనసూయ, శంకరయ్య ఎన్నో దవాఖానలు తిరిగినా ఎక్కడా సరైన చికిత్స లభించలేదు. లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం కనిపించ లేదు. పైగా రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తూనే ఉన్నది. ఒకప్పుడు కనీసం గోడలు పట్టుకుని నడువగలిగిన శ్రీనివాస్, ఇప్పుడు అచేతన స్థితిలో బల్లకే పరిమితమయ్యాడు. తండ్రి బతికున్నంత కాలం స్నానం చేయించడం, బట్టలు మార్చడం తదితర సపర్యలు చేస్తూ వచ్చాడు. 2018లో అనారోగ్యంతో తండ్రి చనిపోగా, అప్పటి నుంచి సేవలు చేసే వారే కరువయ్యారు. తల్లి అనసూయ కూడా వృద్ధురాలైంది. ముగ్గురు అన్నదమ్ములున్నా ఎవరి బతుకు వారిదే. వారానికో రోజు కూడా శ్రీనివాస్కు స్నానం చేయించే వారు లేకుండా పోయారు.
ఆయనకు సేవచేస్తే చాలు
నేను పేద కుటుంబంలో పుట్టినా పదో తరగతి వరకు చదువుకున్న. తల్లిదండ్రులు చేసిన పెండ్లి చెడిపోయింది. ఇండ్లల్లో పనులు చేసుకుంటూ అమ్మా బాపులతో ఉంటున్న. మా ఇంటి ముందుట ఉండే శ్రీనివాస్ దీన స్థితిని చూడ లేకపోయిన. శారీరకంగా రోజురోజుకూ క్షీణిస్తున్న శ్రీనివాస్ మానసిక ధైర్యం గొప్పది. ఇదే నాకు నచ్చింది. అందుకే మనసిచ్చి మరీ పెండ్లి చేసుకున్న. ఆయనకు సేవ చేసుకుంటే చాలు ఏ సుఖం అక్కర్లేదనే నిర్ణయానికి వచ్చిన. వద్దు అని చెప్పిన మా బంధువులను ఒప్పించి పెండ్లికి రప్పించుకున్న.