జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ఎంసీహెచ్, డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణ పనుల పరిశీలన
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 30: జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న ఎంసీహెచ్, వ్యాధి నిర్ధారణ కేంద్రాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నా రు. నిర్మాణ పనులను సిబ్బందితో కలిసి శుక్ర వారం పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కేంద్రాలు జిల్లాకే తలమానికమని పేర్కొన్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కావడం సంతోషకరమని, ప్రహరీ,ఇతర సౌకర్యాల కల్పనకు ఇప్పటికే రాష్ట్ర కమిషనర్ వాకాటి కరుణకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. అసెంబ్లీలో సైతం ప్రస్తావించగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. నిధులు త్వరలోనే వస్తాయని పేరొన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా రక్త, మల, మూత్ర పరీక్షలతోపాటు డెంగ్యూ, చికెన్గున్యా, టైఫాయిడ్, షుగర్, థైరాయిడ్, ఆర్థో ఇలా ఎన్నో సేవ లు అందుబాటులోకి రానున్నాయన్నారు. పరీక్షల కోసం కేంద్రానికి ఏడు వాహనాలు కేటాయించారని ప్రతినిత్యం శాంపిల్స్ సేకరించి అదే రోజు ఆన్లైన్తో పాటు నేరుగా రిపోర్టులు రానున్నాయన్నారు.
అత్యధిక పరికరాలు ఇప్పటికే రాగా ట్రయల్ రన్ కొనసాగుతోందని చెప్పారు. ఇతర పరికరాలు, రసాయనాలు అతి త్వరలో రాబోతున్నాయన్నారు. తల్లీబిడ్డల సంక్షేమం కోసం రూ.17 కోట్లతో నిర్మిస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం పనులు సైతం చివరి దశలో ఉన్నాయని, కేంద్రం అందుబాటులోకి వస్తే జిల్లా ప్రధాన దవాఖానకు రోగుల తాకిడి తగ్గి వైద్య సేవలు మరింత సులభతరం అవుతాయన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఇంక్యుబేటర్లు, ఫొటోథెరపీ, ఆపరేషన్ థియేటర్లు సిద్ధమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, కౌన్సిలర్లు ఒద్ది శ్రీలత రాంమోహన్ రావు, జుంబర్తి రాజ్కుమార్, నాయకులు అరె తిరుపతి, జిల్లా డయాగ్నోస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్, స్థానిక ప్రోగ్రాం ఆఫీసర్ సమీరొద్దీన్, అధికారులు, తదితరులు ఉన్నారు.ఎంసీహెచ్ జిల్లాకే తలమానికం