అంగరంగవైభవంగా యాదాద్రి లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పుట్టమన్ను సేకరించి అంకురార్పణ
యాదాద్రి, మార్చి15: పవిత్ర పుణ్య క్షేత్రం యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ప్రభాత వేళ నిత్యపూజలు చేసి కైంకర్యాలు సమర్పించిన అనంతరం వైశేక హోమాలు, ప్రత్యేక తిరుమంజనం నిర్వహించారు.ఆ తర్వాత స్వామివారిని సుందరంగా అలంకరించారు. స్వామివారి ఆస్థానంలో విశ్వక్సేన పూజ, స్వస్తి వాచనం, రక్షా బంధనం, మంత్రపుష్ప నీరాజనాలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం మృత్సంగ్రహణం నిర్వహించి అంకురార్పణ చేశారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఈఓ ఎన్. గీత, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనారసింహచార్యులు, మోహనాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
విశ్వక్సేన ఆరాధనతో
బ్రహ్మోత్సవాలలో పాంచరాత్రాగమ సంప్రదాయం ప్రకారం అందరికన్నా ముందుగా విష్ణు గణాలకు అధిపతియైన విశ్వక్సేనుడిని ఆరాధించారు. నిర్విఘ్నంగా బ్రహ్మోత్సవాలు కొనసాగేలా శంఖు చక్ర ధారి, చతుర్భుజుడైన విశ్వక్సేనుడికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విశ్వశాంతిని, లోక క్షేమాన్ని చేకూర్చమని కోరుతూ స్వస్తివాచనం చేస్తూ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
పుట్టమన్నుతో
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైనది మృత్సంగ్రహణం. మృత్సంగ్రహణమంటే మృత్తికను తీసుకురావడం. సోమవారం సాయంత్రం ఆరున్నరకు అర్చక బృందం మేళతాళాలతో పుట్ట వద్దకు వెళ్లి పూజ చేసి, భూసూక్తాన్ని పఠించి పుట్టమన్నును స్వీకరించారు. మట్టిని తొమ్మిది నవ పాలికల్లో వేసి నవధాన్యాలు ఉంచి మంత్ర జపాలతో ప్రోక్షణ చేసి అంకురార్పణ చేశారు. ఉత్సవాలు ముగిసే వరకు వీటిని కదిలించరు.
రక్షాబంధనం
పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను నిర్వహించేవారు నియమ నిష్టలతో మెలగాల్సి ఉంటుంది. ఒక దీక్షలా కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం ఉత్సవాలను నిర్వహించే వారిని అవి ముగిసే వరకు కంకణ బద్ధులుగా ఉంచేందుకు పవిత్ర కంకణాలకు మంత్రములతో ఆరాధన చేస్తారు. స్వామి వారికి, అమ్మవారికి సమర్పించిన అనంతరం ఆలయ అనువంశికకర్త, ప్రధానాచార్యులు, ఇతర యాజ్ఞీకులు, ఈవో తదితరులు రక్షాబంధనం స్వీకరించారు.
ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు
శ్రీ లక్ష్మీ నరసింహుడికి ప్రతి ఏటా ఫాల్గుణ మాసం శుద్ధ విదియ నుండి శుద్ధ ద్వాదశి వరకు అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సారి సోమవారం (మార్చి 15) నుంచి 25 వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ సారి కూడా బాలాలయంలో కొనసాగుతున్నాయి. స్వామివారి రక్షాబంధనాలు తోడుగా వేద పండితులు మంత్రోచ్ఛారణ చేస్తుండగా మంగళకర వాయిద్యాల నడుమ ఆలయ అనువంశిక ధర్మకర్త, ఈవో, ప్రధానార్చకులు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు స్వామివారిని గర్భాలయానికి తీసుకొచ్చారు. అక్కడ శ్రీలక్ష్మీ నరసింహుడికి పూజలు నిర్వహించి ఉత్సవ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు.