బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో ఎవుసానికి ప్రాణం పోసిన గోదావరి
పూర్తిగా మారిపోయిన గుండాల మండల ముఖచిత్రం
బీడు భూముల్లో సిరుల పంటలు
మండుటెండల్లోనూ మత్తడిపోస్తున్న చెరువులు
ఆయకట్టులో పెరిగిన సాగు విస్తీర్ణం..పంట దిగుబడులు
రెండు పంటలు వేసుకోవచ్చని సంబురపడుతున్న రైతాంగం
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలోని గుండాల, తుర్కపల్లి, బొమ్మలరామారం నిన్న, మొన్నటివరకు కరువుతో అల్లాడిన ప్రాంతాలవి. ఉరకలెత్తే నీటి ప్రవాహాలు లేక.. పంటలకు నీళ్లుండేవి కావు. జనం వరుస కరువులతో అల్లాడిపోయేవారు. ఈ పరిస్థితుల్లో కాళేశ్వర జలాలు ఈ మూడు మండలాల్లో పెను మార్పును తీసుకొచ్చాయి. కొం డపోచమ్మ నుంచి దిగువకు జాలువారిన గోదావరి జలాలు పొలాల వైపు మళ్లగా.. బీడు భూ ముల్లో రత్నాల్లాంటి రాశులు పండుతున్నాయి. ఇప్పుడా మూడు మండలాల రైతులు.. గోదావరి పేరు వింటేనే పులకించిపోతున్నారు. సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో ఎక్కడో పా రుతున్న గోదారమ్మను.. కొండపోచమ్మ సాగర్ ద్వారా గతేడాది జూన్లో ఆలేరు నియోజకవర్గం లోని బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో పారించి రైతాంగానికి కొత్త బతుకునిచ్చారు. అంతకు రెండేండ్ల క్రితమే దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నవాబ్పేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలంలో గోదావరి జలాలను పారించారు. ఫలితంగా.. మెట్ట, మాగాణి అన్న తేడా లేకుండా నేడు రైతులు బంగారు పంటలు పండించుకుంటున్నారు. ఒక ప్పుడు దండుగలా మారిన ఎవుసానికి జీవం పోసిన గోదావరి జలాలను చూసి రైతు కుటుం బాలు సంతోషంతో గడుపుతున్నాయి.
రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు
గోదావరి జలాల రాక మునుపు ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో వర్షాధార వ్యవసాయమే సాగేది. రైతులు చిరు, తృణ ధాన్యాలను మాత్రమే సాగు చేసేవారు. అరకొర దిగుబడులతో రైతులు అష్టకష్టాలు పడేవారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతాల పరిస్థితి మెరుగుపడింది. కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి జలాల రాకతో ఇక్కడి పల్లెల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒట్టిపోయిన చెరువులు నేడు గోదారి నీటితో కళకళలాడుతున్నాయి. కాల్వల ద్వారా వేల ఎకరాలకు నీళ్లందుతుండటంతో బీడు భూ ములకు సాగు కళ వచ్చింది. ఎటు చూసినా జలకళను సంతరించుకున్న చెరువులు, కాల్వలు.. పొలాల్లో పచ్చదనమే కనిపిస్తున్నది. భూగర్భజలాలు పెరిగి బోర్లు సైతం పుష్కలంగా పంటలకు నీరందిస్తున్నాయి. ఫలితంగా.. పచ్చని పంటలతో పొలాలు కళకళలాడుతుండటంతో రైతు మో ములో చిరునవ్వు వికసిస్తున్నది. ఒకప్పటి తాగునీటి ఇబ్బందులను సైతం గోదావరమ్మ తీర్చింది. ఓ వైపు ఎండలు మండిపోతున్నా.. తుర్కపల్లి మండలంలోని గోపాల్పూర్, నాగాయపల్లి, చిన్న లక్ష్మాపూర్, మాదాపూర్ గ్రామాల పరిధిలోని చెరువులు.. బొమ్మలరామారం మండలంలోని తిమ్మాపురం గూడెంచెరువు, తిమ్మప్ప చెరువులు అలుగు పోస్తూ అబ్బురపరుస్తున్నాయి.
సాగే కాదు..దిగుబడులూ పెరిగాయి
గోదావరి జలాలు వచ్చిన తర్వాత గుండాల, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పొట్టచేత బట్టుకుని ఊరొదిలి వెళ్లి పోయిన రైతు కుటుం బాలు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాయి. ఉన్న ఊర్లోనే చేతినిండా పని దొరి కిందని సంబురపడుతున్నారు. గోదావరి నీళ్లు రాక మునుపు గతేడాది యాసంగిలో బొ మ్మలరామారం మండలంలో 3,800 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేయగా.. గోదావరి నీళ్లు వచ్చాక వానకాలంలో వరిసాగు విస్తీర్ణం 5,600 ఎకరాలకు పెరిగింది. అలాగే తుర్కపల్లి మం డలంలో యాసంగి 10,251 ఎకరాల్లో రైతులు వరిని సాగుచేస్తే.. వర్షాకాలంలో 10,612 ఎకరాల్లో వరిని సాగు చేశారు. అలాగే ప్రస్తుత యాసంగి పంటల దిగుబడులు సైతం ఊహించని విధంగా వస్తున్నాయి. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతుండగా.. ఇప్పటికే చాలా గ్రామాల రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధరను పొందేందుకు సమాయత్తమవుతున్నారు.
రూ.10 కోట్ల విలువైన మత్స్య సంపద
జిల్లాలో 172 పెద్ద చెరువులు, 956 వరకు చిన్న చెరువులు ఉన్నాయి. మూసీ పరీవాహక ప్రాంతం వెంట మరో 20 వరకు చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 127 మత్స్య సహకార సంఘాలు, మరో ఐదుమహిళా మత్స్య సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సంఘాల పరి ధిలో 8వేల మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం.. నీటితో చెరు వులు, కుంటలు కళకళలాడుతుండటంతో గతేడాది మత్స్యశాఖ 435 చెరువుల్లో 2020-21 సంవత్సరానికిగాను 2.50 కోట్ల చేప పిల్లలను వదిలింది. ఎంపిక చేసిన కొన్ని చెరువుల్లో రొయ్యలను సైతం వదిలారు. పెద్ద చెరువుల్లో 80-90ఎంఎం సైజు చేప పిల్లలు, చిన్న చెరువుల్లో 30-40ఎంఎం సైజు చేప పిల్లలను వదిలారు. ప్రస్తుతం చేపలు పెరిగి పెద్దవి కావడంతో ఇప్పటికే మత్స్యకార్మికులు చేపల వేటను మొదలుపెట్టి జీవనోపాధి పొందుతున్నారు. జిల్లా అవసరాలు పోనూ.. ఇక్కడి చేపలు తమిళనాడు, కోల్కతా తదితర ప్రాం తాలకు సైతం ఎగుమతి అవు తున్నాయి. టన్నుకు రూ.60వేల వరకు మత్స్యకార్మిక కుటుంబాలకు ఆదాయం వస్తుండగా.. గతేడాది చెరువుల్లో వదిలిన చేపల ద్వారా ఆయా కుటుంబాలు రూ.10కోట్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని మత్స్యశాఖ చెబుతోంది. గతంలో చేపల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తే.. ప్రస్తుతం స్థానికంగానే తక్కువ ధరకు తాజా చేప లు దొరుకుతున్నాయి. ఏడాది పొడవునా మత్స్యకార్మికులకు చేతినిండా ఉపాధి లభిస్తుండటంతో ఆయా కుటుంబాలు సైతం సంతోషంగా ఉన్నారు.
జిల్లాలో ఏడున్నర మీటర్ల లోతులోనే భూగర్భజలాలు
తెలంగాణ ప్రభుత్వం గత నాలుగైదేండ్లలో నీటి సంరక్షణ కోసం చేపట్టిన చర్యలు ఫలించడంతో జిల్లాలో గతంలో కంటే పరిస్థితులు మెరుగుపడ్డాయి. మిషన్ భగీరథతో చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడం..ఉపాధిహామీ పథకంలో నీటి నిల్వకు సంబంధించిన పనులను విరివిగా చేపట్టడం.. ఇంకుడు గుంతల ఏర్పాటుతో ప్రజల్లో వచ్చిన చైతన్యం తదితర పరిస్థితులు.. భూ గర్భ జలాలు పెరగడానికి కారణమయ్యాయి. ఒకప్పటి కరువు పరిస్థితులు క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. మూసీ పరవళ్లకు తోడు ఈ ఏడాది గోదావరి జలాలు సైతం జిల్లాకు రావడం కొంతవరకు కలిసొచ్చింది. 24 గంటల కరెంట్, పెట్టుబడి సాయం వంటి పథకాలు పంటల సాగులో రైతులకు తోడ్పాటునందిస్తుండడంతో ఊహించని రీతిలో పంటలు సాగవుతున్నాయి. విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాలు ఒక్కసారిగా పాతాళాన్ని వీడి పైకి ఉబికి వస్తున్నాయి.
గతేడాది మార్చిలో 11.19 మీటర్ల అడుగులో భూగర్భ జలాలు ఉం డగా..ప్రస్తుతం మూడున్నర మీటర్లకు పెరగడంతో జిల్లాలో సరాసరి సగటున ఏడున్నర మీటర్లలోనే భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చాయి. 17 మండలాల్లోనూ తక్కువ అడుగుల లో తులోనే భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చాయి. భూగర్భ జలాలు అధఃపాతాళంలో ఉండే సంస్థాన్నారాయణపురం మండలంలోనూ ఈ ఏడాది భూగర్భ జలాలు పెరిగాయి. గతేడాది మార్చిలో 25.14 మీటర్ల లోతులో ఉన్న జలాలు ప్రస్తుతం 10.52 మీటర్ల ఎత్తులోకి పెరిగాయి. అంటే ఏడాది కాలంలో ఏకంగా 14.62 మీటర్ల పైకి అమాంతంగా భూగర్భజలాలు పెరిగాయి. గోదావరి జలాలు పారుతున్న మండలాల విషయానికొస్తే.. బొమ్మ లరామారం మండలంలో గత మార్చిలో 9 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 6.49 మీటర్ల పైకి వచ్చాయి. తుర్కపల్లి మండలంలో గత మార్చితో పోలిస్తే ప్రస్తుతం మీటర్ మేరనే జలాలు పెరిగాయి. అలాగే గుండాల మం డలంలో 12.03 మీటర్ల లోతులో ఉన్న జలాలు 7.05 మీటర్లకు పెరగడంతో ప్రస్తుతం ఈ మండలంలో 4.98 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉంటున్నాయి. భూగర్భ జలాల పెంపుతో ఒకప్పుడు ఆగిఆగి పోసే బోర్లు నేడు నిరంతరాయంగా పంటలకు నీరందిస్తున్నాయి. బావులు సైతం ఎండాకాలంలో జలకళతో సాక్షాత్కరిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు విశాఖ శారదా పీఠాధిపతుల సూచన