ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం
పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన జిల్లా
‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం’లో పాల ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేందుకు శ్రీకారం
ఇతర స్థానిక ఉత్పత్తులతో ఉపాధి అవకాశాలు కల్పించేందుకుప్రతి గ్రామ సమాఖ్యలో మూడు యూనిట్ల చొప్పున ఏర్పాటు
జిల్లాలో 1,665 యూనిట్లను నెలకొల్పేందుకు సన్నద్ధం
ఆగస్టు నాటికి పూర్తికానున్న ప్రక్రియ
యాదాద్రి భువనగిరి, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన జిల్లాలో పాడి అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి(ఓడీఓపీ) పథకంలో భాగంగా జిల్లాలో పాలతోపాటు ఇతర స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉత్పత్తుల విక్రయాలతో ఆర్థిక స్వావలంబన చేకూరడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు లభించే అవకాశం ఉండగా.. ఇందుకు సంబంధించి జిల్లాలో కార్యాచరణ మొదలైంది. జిల్లాలో 555 వరకు గ్రామ సమాఖ్యలు ఉండగా.. ప్రతి సమాఖ్య పరిధిలో మూడు యూనిటు నెలకొల్పనున్నారు. ఈ ప్రక్రియను ఈ ఏడాది ఆగస్టు 25లోపు పూర్తిచేసేందుకు అధికారయంత్రాంగం సిద్ధమవుతోంది.
వలసలను అరికట్టి ఎక్కడివారికి అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా జిల్లాలో ప్రధాన ఉత్పత్తులకు సంబంధించిన జాబితాను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాయి. జిల్లాలో పాల ఉత్పత్తి రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నది. మదర్ డెయిరీకి నిత్యం 35-40వేల లీటర్ల వరకు పాలు వస్తుండగా, మరో 20వేల వరకు ఇతర డెయిరీలకు, మార్కెట్లలో పాడి రైతులు పాలను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పాల ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యతను కల్పించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్ గ్రామంలో 151 ఎకరాల్లో నెలకొల్పనున్న ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్కు వస్తున్న విపరీతమైన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ప్రాసెసింగ్ పార్క్ను నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పాల ఉత్పత్తికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా.. పాల ఉత్పత్తులను కొనుగోలు చేసేలా.. కేంద్ర వాణిజ్య శాఖ తన వెబ్సైట్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయనున్నది. దీనివల్ల ఇక్కడి పాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో ప్రాచుర్యం లభించడంతోపాటు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడుతాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
ఇతర స్థానిక ఉత్పత్తులకూ ప్రాచుర్యం కల్పించేలా..
యాదాద్రి భువనగిరి జిల్లా పాలతోపాటు ధాన్యం, పత్తి, ఎర్ర మిరప, ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్, బల్క్ డ్రగ్స్, బ్రాస్ కాస్టింగ్, కాంస్య శిల్పాలు, పోచంపల్లి ఇక్కత్కు ప్రసిద్ధి. ఈ క్రమంలో సంబంధిత ఉత్పత్తులకు ప్రాచుర్యం, తగిన మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. ఆయా ప్రాంతాల్లో తయారు చేసే ఉత్పత్తులు, హస్త కళలు, పంటలను గుర్తించి ఆ ప్రకారంగా.. యూనిట్లను నెలకొల్పే దిశగా జిల్లాలోని వివిధ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. జిల్లాలో 555 వరకు గ్రామ సమాఖ్యలు ఉండగా, ప్రతి సమాఖ్య పరిధిలో మూడు యూనిట్ల చొప్పున మొత్తం 1,665 యూనిట్లను నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో యూనిట్ను రూ.లక్ష నుంచి రూ.3లక్ష వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్లలో తయారైన ఉత్పత్తులకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా తగిన ధర లభించేలా చర్యలు తీసుకుంటారు. ఉత్పత్తిదారు, కొనుగోలుదారు నేరుగా క్రయవిక్రయాలు జరుపుకునేలా వీలు కల్పిస్తారు. అవసరమైతే ఉత్పత్తిదారులకు బ్యాంకుల ద్వారా రుణ సాయం అందిస్తారు. ఈ విధంగా జిల్లాలో ప్రత్యేక ఉత్పత్తులను ఎంపిక చేసి వాటిని ప్రాసెస్ చేసి విక్రయించడం వల్ల సదరు యాజమాన్యాల ఆదాయం పెరగడంతోపాటు వినియోగదారులకు కూడా నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి