ఒకప్పుడు పల్లె సమస్యలకు నిలయం. నేడు అదే పల్లె అభివృద్ధి మూటగట్టుకున్న ముల్లె. పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కల పెంపకం.. ఆహ్లాదంగా సేదతీరేందుకు ప్రకృతి వనం.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్ల ఏర్పాటు.. ఆటంకాలు లేకుండా అంత్యక్రియలు నిర్వహించేలా వైకుంఠధామం.. వెరసి నేడు ప్రతి గ్రామం ప్రగతి దిశలో పయనిస్తున్నది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే వైకుంఠ ధామాలు 394, డంపింగ్ యార్డులు 405, పల్లె ప్రకృతి వనాలు 648 వినియోగంలోకి వచ్చాయి. ఒకటి, రెండుచోట్లా స్థల వివాదంతో పనులు నిలిచిపోగా.. అక్టోబర్ 10 నాటికి అన్నింటినీ పూర్తి చేసే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ప్రగతి పనులతో కొత్తకాంతులు వెదజల్లుతున్న పల్లెలను చూసి గ్రామస్తులు మురిసిపోతున్నారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. మురుగు కాల్వలను ఎప్పుడో శుభ్రం చేసేవారు. స్తంభాలకు దసరాకు లైట్లు వేస్తే.. మళ్లీ దసరాకే మోక్షం. కానీ, సీఎం కేసీఆర్ చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం.. పల్లెల రూపురేఖలనే మార్చివేసింది. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాలు, ట్రాలీ ట్యాంకర్తో కూడిన ట్రాక్టర్లు.. ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరాయి. ఎక్కడ చూసినా పచ్చని పల్లెలు దర్శనమిస్తున్నాయి. పరిశుభ్రమైన వీధులు స్వాగతం పలుకుతున్నాయి. వేలాడే విద్యుత్తు లైన్ల స్థానంలో కొత్తవి సరిచేశారు. ప్రతి స్తంభానికీ ఎల్ఈడీ లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ప్రతి పల్లెలోనూ అభివృద్ధి సంబురంలా సాగుతున్నది.’
అన్ని చోట్లా పనుల పూర్తికి చర్యలు…
సంస్థాన్ నారాయణపురం మండలంలోని సగానికి పైగా ఆవాసాలు రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మండలంలోని కందిబాయితండా, గన్నమోళ్లతండా, పల్లగట్టుతండా, పుర్లగడ్డతండా, రాచకొండ, తుంబావితండా, వాచ్యాతండా పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులను చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు రిజర్వ్ ఫారెస్టు భూముల్లోనూ పల్లె ప్రగతి పనులను చేపట్టారు. తుర్కపల్లి మండలంలోని రామెజీనాయక్తండా, వలిగొండ మండలంలోని వెంకటాపూర్, ఆలేరు మండలంలోని కందిగడ్డతండా, నారాయణపురం మండలంలోని జనగాంలో స్థల వివాదంతో పనులను చేపట్టలేదు. బస్వాపూర్(నృసింహ) రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న భువనగిరి మండలంలోని బీఎన్ తిమ్మాపూర్, లప్పనాయక్తండా పంచాయతీల్లోనూ పనులను ప్రారంభించలేని పరిస్థితి. అయితే స్థానిక సమస్యలను అధిగమించి అన్ని పంచాయతీల్లోనూ పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఓ వైపు ఆదాయం.. మరోవైపు ఉపాధి…
జిల్లాలోని ప్రతి పంచాయతీలో డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్లను ప్రభుత్వం నిర్మించింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను వేరుచేసి కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరువుల తయారీ మొదలైంది. ప్రస్తుతం ఇది గ్రామాల్లో నాటిన మొక్కలకు ఉపయోగపడుతున్నది. ఎరువుల విక్రయాల ద్వారా మున్ముందు పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరనుంది. ప్రతి పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో కూలీలకు ఉపాధి అవకాశాలు కలిగాయి. ప్రభుత్వం కొంత నిధులను సామగ్రి కింద వ్యయం చేస్తుండగా.. కూలీలకు వేతనాలు అందించి ప్రకృతి వనాల పెంపకాన్ని చేపడుతోంది. దీంతో ఉన్న ఊర్లోనే కూలీలకు పని దొరికినైట్లెంది.
వైకుంఠ ధామాలు..
గ్రామంలో ఎవరైనా చనిపోతే శివారులోని బహిరంగ ప్రదేశాలు, పొలాల వద్దనే అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందులను తీర్చి ఆత్మీయ వీడ్కోలును గౌరవంగా నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రతి గ్రామంలో అన్ని హంగులతో కూడిన వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. జిల్లాలో 421 పంచాయతీలకుగాను 394 పంచాయతీల్లో వైకుంఠధామాలు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 394 నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. 21 నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా.. కేవలం నాలుగు చోట్ల స్థల వివాదంతో పనులు నిలిచిపోయాయి.
డంపింగ్ యార్డులు..
పరిశుభ్ర పల్లెలుగా తీర్చిదిద్దేందుకు చెత్త సేకరణకోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ను సమకూర్చింది. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేలా చర్యలు చేపట్టింది. తడి చెత్తను కంపోస్ట్ యూనిట్కు తరలించి సేంద్రియ ఎరువును తయారుచేసేలా చర్యలు చేపట్టింది. 421 పంచాయతీలకుగాను ఇప్పటివరకు 405 చోట్ల డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్లు అందుబాటులోకి వచ్చాయి. 11 చోట్ల వివిధ దశల్లో పురోగతిలో ఉండగా.. స్థల వివాదంతో మూడు చోట్ల పనులు ప్రారంభం కాలేదు.
పల్లె ప్రకృతి వనాలు..
పల్లెవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి ఆవాసంలోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వాకింగ్ ట్రాక్ వంటి హంగులను సైతం కల్పించారు. 421 పంచాయతీలతోపాటు వాటి పరిధిలోని 229 ఆవాసాలు కలుపుకొని మొత్తం 650 ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టగా.. 648 వనాలు ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చాయి.
అక్టోబర్ 10 లోగా పూర్తికి చర్యలు…
జిల్లాలో పల్లె ప్రగతి పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. స్థల వివాదాలు ఉన్న చోట్ల మాత్రమే పనులు ప్రారంభం కాలేదు. అక్టోబర్ 10 లోపుగా అన్ని పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు పనులను పూర్తి చేసేలా మండల స్థాయి అధికారులను సమాయత్తపరుస్తున్నాం.
ఉపేందర్ రెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా