యాదాద్రీశుడికి వైభవంగా నిత్యపూజలు
యాదాద్రి, సెప్టెంబర్ 24 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం లక్ష్మీపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. విశ్వక్సేనుడికి తొలిపూజలతో సుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. బాలాలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారికి సాయంత్రం వేళలో ఊంజల్ సేవ నిర్వహించారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. బాలాలయం ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా 516 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. నిత్య తిరుకల్యాణోత్సంలో భక్తులు పాల్గొన్నారు. కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు స్వామివారి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. కమిషనర్ వెంట డీఈఓ చైతన్య జైనీ, ఏఈఓలు గట్టు శ్రవణ్కుమార్, ఆలయ అధికారులు నరేశ్ పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ. 6,13,391 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 59,858
రూ.100 దర్శనం టిక్కెట్ 30,000
సుప్రభాతం 400
వేద ఆశీర్వచనం 3,096
నిత్యకైంకర్యాలు 2,201
ప్రచారశాఖ 900
క్యారీబ్యాగుల విక్రయం 3,000
వ్రత పూజలు 12,500
కల్యాణకట్ట టిక్కెట్లు 11,200
ప్రసాద విక్రయం 2,63,795
వాహన పూజలు 4,000
టోల్గేట్ 840
అన్నదాన విరాళం 33,782
సువర్ణ పుష్పార్చన 61,260
యాదరుషి నిలయం 30,100
పాతగుట్ట నుంచి 9,735
ఇతర విభాగాలు 53,376