పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రికి విశేష ఆదరణ తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్
అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు పల్లె
అనుభూతులను పంచేందుకు శిల్పారామాన్ని సిద్ధం చేయిస్తున్నారు. చుట్టూ గుట్టలు.. ఎటు చూసినా పచ్చదనం.. మధ్యలో చెరువుతో సహజ సిద్ధ అందాలకు నెలవైన రాయగిరి చెరువు ప్రాంతాన్ని అందుకోసం వైటీడీఏ అభివృద్ధి చేస్తున్నది. మాదాపూర్, ఉప్పల్ శిల్పారామాలకు మించిన నమూనాలను రూపొందిస్తున్నది. రెండెకరాల స్థలంలో గ్రామీణ ఇతివృత్తాలు, హస్త కళా స్టాల్స్, మ్యూజియం, బోటింగ్ సహా పర్యాటకులను ఆకట్టుకునేందుకు సకల హంగులను సమకూరుస్తున్నది.ఇప్పటికే తొలిదశ పనులు పూర్తవ్వగా..త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లక్ష్మీనృసింహుడి దర్శనానంతరం భక్తులు తమ యాత్రను మరింత ఆహ్లాదభరితంగా కొనసాగించేలా యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాలను వైటీడీఏ తీర్చిదిద్దుతున్నది. పల్లె అనుభూతి పంచేందుకు యాదాద్రిలో శిల్పారామం సిద్ధమవుతున్నది. శిల్ప కళావైభవం, హస్తకళలకు విశేష ఆదరణ పొందుతున్న ఉప్పల్, మాదాపూర్ తరహాలోనే యాదాద్రిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు వైటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. అందమైన లక్కబొమ్మలు, ఆకర్షణీయమైన వస్ర్తాలు, చిన్నా పెద్ద అందరినీ ఆనందంలో ముంచెత్తేలా పనులు చకచకా సాగుతున్నాయి. సందర్శకుల తాకిడి గణనీయంగా ఉండేలా శిల్పారామంను తీర్చిదిద్దుతున్నారు.
తొలిదశ పనులు పూర్తి..
యాదాద్రికి వెళ్లేదారిలో రాయగిరి చెరువు అలుగు ప్రాంతం వద్ద రెండు ఎకరాల స్థలాన్ని శిల్పారామం కోసం కేటాయించారు. ఇందులో 1.20 ఎకరాల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నారు. తొలిదశలో భాగంగా ఇప్పటికే పలు పనులను పూర్తి చేశారు. పరిసరాలన్నీ పచ్చదనంతో వెల్లివిరిసేలా గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. శిల్పారామంలోకి ప్రవేశించే మార్గంలో ఆర్చిని నిర్మించగా.. తుది మెరుగులతో ప్రత్యేకంగా ఆకర్షించేలా పలు రకాల డిజైన్లను పరిశీలిస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు సేదతీరేందుకు మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. పర్యాటకుల ఆదరణ పొందేలా, ఫౌంటేన్, విభిన్న రుచులతో ఫుడ్ కోర్టు ఏర్పాట్లు చేయనున్నారు. చెరువు మధ్యలో ఐలాండ్, పక్కనే వంతెన వంటి నిర్మాణాలతో పాటు బోటింగ్ కోసం ప్రత్యేకించి చర్యలు తీసుకుంటున్నారు. బోట్లలో షికారుతో అనుభూతి పొందేలా మూడు బోట్లను ఒక జెట్ అందుబాటులో ఉంచనున్నారు. పర్యాటకుల రద్దీకి అనుగుణంగా మరో రెండు బోట్లను సమకూర్చనున్నారు. ఎటుచూసినా చక్కటి పల్లెటూరి వాతావరణం వెల్లివిరిసేలా, రాత్రి వేళల్లో పరిసరాలన్నీ జిగేల్ మన్పించేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నారు.
విభిన్న రీతిలో శిల్పారామానికి రూపకల్పన
ఉప్పల్, మాదాపూర్లోని శిల్పారామాలు పర్యాటకుల ఆదరణ పొందుతున్న తరుణంలో అక్కడ పనిచేసిన కాంట్రాక్టర్లతోనే పనులు చేయిస్తున్నారు. అయితే యాదాద్రి ప్రపంచ ఆధ్మాత్మిక కేంద్రంగా అలరించనుండడంతో ఇక్కడి శిల్పారామానికి మరింత వన్నె తీసుకొచ్చేలా భిన్నంగా రూపకల్పన చేస్తున్నారు. మ్యూజియంతోపాటు ఆకట్టుకునే రీతిలో ఎగ్జిబిట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. అందమైన లక్కబొమ్మలు, పోచంపల్లి కాటన్, పట్టు చీరలు, బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఆర్టిఫీషియల్ జ్యువెల్లరీ వంటివి ప్రదర్శనల్లో ఆకట్టుకునేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు..
యాదాద్రికి వచ్చే భక్తులు కుటుంబ సభ్యులతో పల్లె వాతావరణంలో సేదతీరేలా శిల్పారామమాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నాం. ఉప్పల్, మాదాపూర్లోని శిల్పారామాలకు సందర్శకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అదే తరహాలో ఇక్కడి శిల్పారామం ఆదరణ పొందేలా సకల హంగులతో త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – కిషన్ రావు, వైటీడీఏ వైస్ చైర్మన్