ఇక్కడ కనిపిస్తున్నది సంస్థాన్నారాయణపురం నుంచి వావిళ్లపల్లికి వెళ్లే రోడ్డు. ఇలా దారి మొత్తంగా ధ్వంసమై గుంతలమయంగా మారింది. ఈ రహదారి నిర్మాణానికి రెండేండ్ల కిందే రాష్ట్ర ప్రభుత్వం రూ.80లక్షలు మంజూరు చేసింది. అయినా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదు.
ఆర్అండ్బీ అధికారులు చోద్యం చూస్తుండడంతో తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.
సంస్థాన్నారాయణపురం, సెప్టెంబర్ 23 : రెండు అడుగులకు ఒక గుంత. కంకర తేలిన రోడ్డు. దుమ్ము, ధూళితో కూడిన రహదారిపై ప్రయాణమంటే వాహనదారులకు నిత్యం నరకమే. సంస్థాన్నారాయణపురం నుంచి వావిళ్లపల్లికి వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికుల పాలిట నరక ప్రాయంగా మారింది. బీటీ రోడ్డు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో పరిస్థితి దారుణంగా మారింది. మండల కేంద్రం నుంచి జనగాం, వావిళ్లపల్లి, లచ్చమ్మగూడెం వరకు 8 కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలు పడి పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమే. ఇటీవల వర్షాలకు కంకర తేలి రోడ్డు మరింత ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి త్వరగా రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు మంజూరై రెండేండ్లు
సంస్థాన్ నారాయణపురం నుంచి లచ్చమ్మగూడెం గేటు వరకు బీటీ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం రెండేండ్ల క్రితమే రూ.80 లక్షలు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇప్పటి వరకూ పనులను ప్రారంభించలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అడిగినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండుసార్లు కింద పడ్డా
వావిళ్లపల్లి నుంచి ప్రతిరోజూ పనులు కోసం బైక్పై వెళ్తుంటా. రోడ్డు మొత్తం గుంతలతో అధ్వానంగా తయారైంది. ఎదురుగా వాహనం వస్తుంటే రోడ్డు దిగి ఎక్కే క్రమంలో ఈ మధ్య రెండుసార్లు కింద పడ్డా. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది.
బోలుగురి రాజు, వావిళ్లపల్లి
కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం
రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న మాట వాస్తవమే. నారాయణపు రం నుంచి లచ్చమ్మగూడెం గేటు వరకు బీటీ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.80 లక్షలు మంజూరు చేసింది. టెండ ర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నేటి వరకు పనులు ప్రారంభించలేదు. కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేశాం. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తిచేస్తాం.
లింగయ్య, ఆర్అండ్బీ ఏఈ