అంగన్వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ : కలెక్టర్ పమేలా సత్పతి
యాదగిరిగుట్ట రూరల్/భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 22 : చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. చిన్నారులకు క్రీడలతో పాటు విద్యాబోధన అందిస్తూ ఆరోగ్యవంతులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు అంగన్వాడీ సెంటర్లు ఉపయోగపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రీయ పోషణ్ అభియాన్లో భాగంగా బుధవారం యాదగిరిగుట్ట మండలం బాహుపేట, పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణుల ఆరోగ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిపాలు పట్టించాలని సూచించారు. బాలమృతం ఎంతో ఉన్నత పౌష్టిహాహారం అని, అది చిన్న పిల్లలను బలవంతులుగా తయారు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో పాల్గొని వారికి పూలు, పండ్లు అందించారు. చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మొక్కలను నాటారు. గ్రామంలో రైల్వే అండర్ పాస్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎంపీపీ చీర శ్రీశైలం కలెక్టర్ను కోరారు. భువనగిరిలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ జయశ్రీ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, బాహుపేటలో డీడబ్ల్యూఓ కృష్ణవేణి, సీడీపీఓ చంద్రకళ, సర్పంచ్ కుండె పద్మ, మండల వైద్యాధికారి వంశీకృష్ణ, సరిత పాల్గొన్నారు.