అత్యద్భుతంగా రూపు దిద్దుకుంటున్న ఆధ్యాత్మిక నగరి యాదాద్రి వైభవాన్ని కండ్ల ముందుంచిన సీఎం కేసీఆర్సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక వేదికగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం
దేశ, విదేశీయులనుఆకర్షించేలా హంగులు 250 ఎకరాల్లో ప్రత్యేకతను చాటుతున్న టెంపుల్ సిటీ
మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో పార్కులు ఆహ్లాదం పంచనున్న నృసింహసాగర్ రిజర్వాయర్పనుల వేగంపై వైటీడీఏ ప్రత్యేక దృష్టి మూడు నెలల్లో లక్ష్మీ తటాకం పనులు పూర్తి
యాదాద్రి.. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాదు, అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగానూ అలరించనున్నది. గొప్ప చరిత్ర, అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉన్న లక్ష్మీనారసింహ క్షేత్రానికి విశిష్ట ఖ్యాతి దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత సంకల్పం తీసుకున్నది. అందుకు తగ్గట్టుగానే.. ఎక్కడ అనువైన స్థలం కనిపించినా ఆధ్యాత్మిక, పర్యాటక రూపంలో సుసంపన్నం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా యాదాద్రి 16వ పర్యటనలో భవిష్యత్ వైభవాన్ని కండ్లకు కట్టారు. ఇప్పటికే స్వామివారి కొండకు పక్కనే ఉన్న పెద్దగుట్టపై 250 ఎకరాల్లో టెంపుల్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా… ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో పార్కులు, అంతర్జాతీయ స్థాయిలో నృసింహ రిజర్వాయర్ పరిసరాలను తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభ తేదీని సీఎం ప్రకటించిన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచడంపై వైటీడీఏ దృష్టి సారించింది.
-యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అంతర్జాతీయ ఆధ్మాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్నది. ‘న భూతో న భవిష్యత్’ అన్నరీతిలో పూర్తిగా కృష్ణశిలలతో వెయ్యేండ్లయినా చెక్కు చెదరకుండా ముస్తాబైంది. ఇప్పటివరకు రూ.850 కోట్లను వెచ్చించగా.. ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ రూపురేఖలనే మారుస్తున్నది. వచ్చే ఏడాది మార్చి 28 తర్వాత భక్తజనానికి మూలవరుల దర్శన భాగ్యం కలగబోతుండగా.. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనాన్ని ఆధ్యాత్మికంగానే గాకుండా ఆహ్లాదపరంగా ఓలలాడించేలా సీఎం కేసీఆర్ కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. మహా కుంభ సంప్రోక్షణ నాటికే వీలైనంతలో అన్ని వసతులు, సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పనులు వేగిరం కావడంతోపాటు, వసతులు, పర్యాటక పరంగా చేపట్టనున్న సదుపాయాలు సైతం ఊపందుకోనున్నాయి.
గండి చెరువు సుందరీకరణ..
కొండకు ఉత్తరం వైపు గండి చెరువు అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇక్కడ తెప్పోత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గండి చెరువును అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్, వాటర్ ఫౌంటెయిన్లతో తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సూచించడంతో అధికారులు ఆ దిశగా సుందరీకరిస్తున్నారు.
యాదాద్రి దివ్య క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలతో పాటు పర్యాటక సోయగాలనూ పంచనున్నది. యాదాద్రి సహా పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. స్వామి వారి కొండకు పశ్చిమాన పెద్దగుట్టపై 250 ఎకరాల్లో అభివృద్ధి చేసిన టెంపుల్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా.. మైసూరు బృందావన్ గార్డెన్ తరహాలో నృసింహ సాగర్ (బస్వాపూర్)
రిజర్వాయర్కు హంగులు అద్దనున్నారు. మంగళవారం యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. రానున్న రోజుల్లో యాదాద్రిలో వసతులు, అభివృద్ధి పరంగా చేపట్టనున్న కార్యక్రమాలను కండ్లెదుట సాక్షాత్కరింపజేశారు. చుట్టూ ఎన్నో సందర్శనీయ స్థలాలు.. రాబోవు రోజుల్లో వివిధ రూపాల్లో కనువిందు చేయనుండడంతో భక్తజనం పులకించిపోతున్నది.
మనసుదోచే సందర్శనీయ స్థలాలెన్నో..
ఆకుపచ్చని అరణ్యాలు.. ఆకాశం నుంచి దూకే జలపాతాలు.. చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా.. యాదాద్రి ఖ్యాతిని ఇనుమడింపజేసే ఎన్నో సందర్శనీయ స్థలాలు చుట్టూ ఉన్నాయి. చేనేతకు పట్టుగొమ్మలాంటి పోచంపల్లి, రాచరిక వ్యవస్థకు దర్పణం పట్టే రాచకొండ, దేశ, విదేశాల నుంచి వచ్చే పర్వతారోహకులను ఆకర్షిస్తున్న భువనగిరి కోట, సమ్మక్క, సారలమ్మ జాతరను తలపించే కుర్రారం మినీ మేడారం.. లక్ష్మీనారసింహుడి దర్శనం కోసం వచ్చే భక్తులను ప్రకృతి ఒడిలో మైమరిపించేందుకు ఎన్నో పర్యాటక ప్రాంతాలు ‘రా.. రమ్మని’ అంటున్నాయి. ఈ నేపథ్యంలో రాబోవు రోజుల్లో యాదాద్రి పర్యాటక పరంగానూ మరింత ప్రాశస్త్యాన్ని పొందనున్నది.
ప్రత్యేక ఆకర్షణగా ‘టెంపుల్ సిటీ’…
యాదాద్రి దివ్య క్షేత్రానికి పడమర దిక్కున ఉన్న పెద్ద గుట్టపై సుమారు 250 ఎకరాల్లో వివిధ రకాల చెట్లు, పూల మొక్కలను పెంచి పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నారు. విశాలమైన రోడ్లు, పచ్చదనం ఉట్టిపడేలా పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. పెద్దగుట్ట పైకి వెళ్లడానికి రెండు ఘాట్ రోడ్లను సైతం ఇప్పటికే నిర్మించారు. గుట్టపై వసతి గృహాలు, ఇతర నిర్మాణాలను చేపట్టనుండగా.. సీఎం కేసీఆర్ తాజా ఆదేశాల మేరకు టెంపుల్ సిటీలో 250 డోనర్ కాటేజీలను నిర్మించనున్నారు. దక్షిణం వైపున ఉన్న మరో గుట్టపై ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి ప్రముఖులకు వసతి సౌకర్యం కల్పించడానికి 13 ఎకరాల్లో చేపట్టిన భవన నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పచ్చదనంతో వెల్లివిరుస్తున్న ఆలయ పరిసరాలు
యాదాద్రి పరిసర ప్రాంతాలకు పర్యాటక శోభను కల్పిస్తున్నారు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు రోడ్డుకు ఇరువైపులా, మధ్యలో మొక్కలను ఏర్పాటు చేయడంతోపాటు గార్డెన్ను అభివృద్ధి చేశారు. ఘాట్ రోడ్డును కూడా ఇలాగే తీర్చిదిద్దారు. రాయగిరి నుంచి యాదాద్రికి వచ్చే మార్గంలో భక్తులు సేదతీరేలా నరసింహ, ఆంజనేయ అభయారణ్యాలను ఏర్పాటు చేశారు. వైటీడీఏ పరిధిలో రూ.22కోట్లతో మొక్కల పెంపకంతోపాటు, గార్డెనింగ్ పనులు చేపట్టారు. పార్కులను తలపించేలా కార్పెట్ గ్రాస్ను ఏర్పాటు చేశారు. కొండ మధ్యలో ఖాళీ ప్రదేశాల్లో అందమైన పూల మొక్కలను, సుగంధ, దేవతా, నక్షత్ర మొక్కలను నాటారు. గిరిప్రదక్షిణ కోసం కొండ చుట్టూ 2.7కిలోమీటర్ల మేర కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్గానికి ఇరువైపులా మొక్కలు నాటారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా పెద్ద పెద్ద చెట్లతో పాటు వేప, రావి, సిల్వర్ ఓక్ తదితర ఎత్తుగా పెరిగే చెట్లను పెంచుతున్నారు.
నలు దిక్కులా విశాలమైన రహదారులు
భవిష్యత్ అవసరాల దృష్ట్యా యాదాద్రికి రోడ్డు మార్గాలను విస్తృతం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్రోడ్డుకు సమీపంలో ఉన్న యాదాద్రికి నలుదిక్కుల నుంచి చేరుకునేలా రహదారులను విస్తరిస్తున్నారు. హైదరాబాద్ శివారు నుంచి రాయగిరి వరకు నాలుగు లైన్ల రహదారిని సుందరంగా తీర్చిదిద్దారు. రాయగిరి నుంచి వరంగల్ వరకు చేపడుతున్న నాలుగు లైన్ల రోడ్డు పనులు, యాదాద్రి నుంచి కీసర, తుర్కపల్లి గుట్ట వరకు చేపడుతున్న రోడ్డు పనులు పూర్తికావొచ్చాయి. రాజాపేట మార్గంలోనూ నాలుగు లైన్ల రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కొండ చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. నలు దిక్కుల నుంచి వచ్చే మార్గాలను అనుసంధానిస్తూ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. గుట్ట కింద చేపట్టనున్న బస్టాండ్ నిర్మాణానికి రూ.6.90కోట్లను వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. మహా కుంభ సంప్రోక్షణ నాటికి కొండ పైకి ఉచిత బస్సులను సైతం అందుబాటులోకి తేనుండడంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండనుంది. ఇదే క్రమంలో మూడు వేలకుపైగా కార్లను నిలిపేలా 11 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా నృసింహ సాగర్
లక్షల ఎకరాలను గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేయనున్న నృసింహ(బస్వాపూర్) రిజర్వాయర్ ప్రాంతం పర్యాటకంగానూ అలరించనున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండు గుట్టల నడుమ ఉన్న ఈ రిజర్వాయర్ చుట్టూ 450 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉండగా.. వీటి పరిధిలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మైసూర్ బృందావన గార్డెన్ తరహాలో పార్కులు, మ్యూజికల్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయనుండడంతో ఈ ప్రాంతం యాదాద్రి దర్శనార్థం వచ్చే భక్తులను కనువిందు చేయనున్నది. సినిమా షూటింగ్లు, డెస్టినీ మ్యారేజ్లకు కేరాఫ్గా ఈ ప్రాంతం ప్రాశస్త్యం పొందనుండడంతో రిజర్వాయర్ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ది చెందనుంది. రాయగిరి చెరువు వద్ద ఏర్పాటవుతున్న మినీ శిల్పారామం, యాదరుషి పేరుతో మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో ఇవన్నీ యాదాద్రికి కొత్త శోభను తేనున్నాయి.
యాదాద్రీశుడి సన్నిధికి గోదారమ్మ..
యాదాద్రి, అక్టోబర్ 20 : గుహలో కొలువైన పంచనారసింహుడి పాదాలను గోదారమ్మ కడుగనున్నది. భక్తుల పుణ్యస్నానాలకూ పవిత్ర గోదావరి జలాలు అందుబాటులోకి తీసుకుచ్చే పనులు సాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నృసింహసాగర్ జలాశయం నుంచి లక్ష్మీతటాకాన్ని (గండిచెరువు) నింపేందుకు జరుగుతున్న పనులు మూడు నెలల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.
కాల్వ ద్వారా గండిచెరువుకు నీళ్లు..
కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మితమవుతున్న ప్రధాన కాల్వ తుర్కపల్లి మండల కేంద్రంలోని ముల్కలపల్లిలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో సంగ్యాతండా గ్రామం వద్ద నృసింహసాగర్ జలాశయానికి గోదావరి జలాలు వెళ్లేందుకు నిర్మించిన ప్రధాన కాల్వకు క్రాస్ రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. రెగ్యులేటర్ గేట్లు మూసేస్తే గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి, దాతారుపల్లి, మల్లాపురం గ్రామాల మీదుగా గండిచెరువులోకి చేరుకుంటాయి.
ఆహ్లాదకరంగా లక్ష్మీ తటాకం..
గండి చెరువు ఆధునీకరణ పనులకు రూ.33.69 కోట్లు కేటాయించగా.. రూ.20.10 కోట్లతో గండిచెరువు పూడికతీత, రక్షణగోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పక్కనే భక్తులు స్నానమాచరించేందుకు నిర్మించిన లక్ష్మీపుష్కరిణిలో నిత్యం గోదావరి జలాలను నింపనున్నారు. వర్షం నీరు చెరువులోకి వెళ్లకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. భక్తులు కుటుంబంతో గడిపేందుకు సహజ సిద్ధమైన చెట్ల పందిళ్లు, బల్లలు, పాత్వే, సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. చెరువుచుట్టూ నడకదారి నిర్మించనున్నారు. అదేవిధంగా గండిచెరువును చేరుకునేందుకు లింకురోడ్లను నిర్మించనున్నారు. మిగతా రూ.13.59 కోట్లతో గండిచెరువు పరిసర ప్రాంతాల్లో లాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూల మొక్కలు, దేవతావృక్షాలు, ఔషధ మొక్కలను నాటనున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు లేజర్షోలను తలపించే విధంగా ఫౌంటెన్లు నిర్మించనున్నారు. పరిసర ప్రాంతాల్లో ఆర్నమెంటల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. భక్తిభావం పెంపొందించేందుకు, ఆధ్యాత్మిక పరమైన సదస్సులు నిర్వహించే విధంగా విశాలమైన హాళ్లను నిర్మించనున్నారు.
నృసింహ రిజర్వాయర్ ద్వారా లక్ష్మీ తటాకానికి పవిత్ర జలాలు
గతంలో యాదాద్రి కరువుకు ఆలవాలంగా ఉన్న పరిస్థితి. మంచినీళ్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నృసింహసాగర్ రిజర్వాయర్.. దాన్ని ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ అని కూడా అంటారు. దాని నిర్మాణం పూర్తికావచ్చింది. దీని ద్వారా ప్రతి రోజూ పవిత్ర గోదావరి జలాలతో స్వామిని అభిషేకించే అదృష్టం లభించింది. భక్తుల పుణ్యస్నానాలకు ప్రతి రోజూ పవిత్ర గోదావరి జలాలు ఉంటాయి.