ఊరు చిన్నదే.. కానీ గ్రామస్తుల ఆశయం మాత్రం గొప్పది. కొవిడ్ వ్యాక్సిన్ ఎందుకులే అనుకోలేదు. భయం లేకుండా అందరూ టీకా వేయించుకున్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చారు. గ్రామంలో 18 ఏండ్లు పైబడిన 305 మంది కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడంతో బీబీనగర్ మండలంలోని పల్లె పహాడ్ జిల్లాలో వంద శాతం లక్ష్యాన్ని అందుకున్న తొలిగ్రామంగా రికార్డులో నిలిచింది. 92 మంది మొదటి డోస్, 213 మంది రెండు డోసులను పూర్తి చేసుకున్నారు. వైద్య బృందంతోపాటు పంచాయతీ పాలకవర్గం, ఇతర శాఖల అధికారులు సయన్వయంతో లక్ష్యాన్ని అందుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం గ్రామాన్ని సందర్శించి కేక్ కట్ చేసి అధికారుల బృందాన్ని అభినందించారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బీబీనగర్ : కరోనా నియంత్రణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. బీబీనగర్ మండలంలోని పల్లెగూడెం గ్రామ పంచాయతీ వంద శాతం లక్ష్యాన్ని పూర్తిచేసుకుంది. గ్రామం మొత్తం జనాభా 381. వీరిలో 18 ఏండ్లు పైబడిన వారు 305 మంది ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామవాసులను పిలిపించి మరి వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ఈ గ్రామం వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంది.
కేక్ కట్ చేసి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్
పల్లెగూడెం గ్రామం వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి కేక్ కట్ చేశారు. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో కృషిచేసిన వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. గ్రామ ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. పల్లెగూడెంను ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాలు సైతం వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్ గౌడ్, ఎంపీడీఓ శ్రీవాణి గౌడ్, ఎంపీఓ స్వాతి, గ్రామ పంచాయతీ సర్పంచ్ భారతమ్మ, పంచాయతీ కార్యదర్శి అర్చన, మెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
జిల్లాలో 4,62,828 మందికి వ్యాక్సిన్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికార యంత్రాంగం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. కలెక్టర్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 18 ఏండ్లు నిండి వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితాను రూపొందించారు. ప్రత్యేక ప్రణాళికతో మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని గ్రామాల్లోనూ అమలు చేస్తున్నారు. గత నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని 529 ఆవాసాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. 47,324 మందికి వ్యాక్సినేషన్ చేశారు. ఇందులో 37,729 మందికి మొదటి డోస్ కాగా 9,595 మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేశారు. తాజా వ్యాక్సినేషన్తో కలుపుకుని జిల్లాలో ఇప్పటివరకు 4,62,828 మందికి కొవిడ్ టీకాలు వేశారు. ఇందులో మొదటి డోస్ వేసుకున్నవారు 3,11,063 మంది కాగా 1,51,765 మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.
రెండు డోసులు వేసుకున్నా
నా వయస్సు 55 ఏండ్లు. సూది మంది వేసుకునేందుకు మొదట్లో అందరూ భయపడ్డరు. కానీ నేను భయపడలే. మా ఊర్లో మొదటి టీకా తీసుకున్న వ్యక్తిని నేనే. రెండోసారి కూడా వేసుకోవాలని నర్సులు ఇంటికి వచ్చి చెప్పారు. రెండు రోజుల క్రితమే రెండో డోసు వేసుకున్నా. పూర్తి ఆరోగ్యంతో ఉన్నా.
మొదటి డోసు తీసుకున్నా
నా వయసు 29 ఏండ్లు. ఊర్లోనే ఉంటా కదా.. అనుకుని ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇంటింటి సర్వేలో మా ఇంటికొచ్చిన వైద్య సిబ్బంది తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. ఊర్లో అందరూ తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో నేను కూడా ఇటీవలే తీసుకున్నా.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం
మండలంలో వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయ్యేలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాం. పల్లెగూడెం గ్రామంలో వైద్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేపట్టి ఇంకా ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకోలేదో లెక్క తీశాం. అందరికీ అవగాహన కల్పించడం ద్వారా వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయగలిగాం.