యాదాద్రి, సెప్టెంబర్ 18 : లక్ష్మీసమేతుడైన నరసింహస్వామికి శనివారం నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సుప్రభాతం అనంతరం అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు సమర్పించారు. సుదర్శన ఆళ్వారును కొలు స్తూ హోమం జరిపారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా జరిగిన కల్యాణోత్సవాన్ని భక్తులు వీక్షించి తరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ.100 టిక్కెట్పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజల్లో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపించారు. నవగ్రహాలకు తైలాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ.10, 69,493 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
లడ్డూ తయారీ ట్రయల్ రన్..
యాదాద్రి, సెప్టెంబర్ 18 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యంత్రాల ద్వారా లడ్డూ తయారీ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. బూందీ ఫ్రైయర్, షుగర్ సిరప్ మిషన్, దాల్ పుల్వరైజర్, గ్రైండింగ్ మిషన్, చక్కెర సైలోస్ మిషన్లను ఆన్ చేశారు. బూందీ ప్రైయర్లో పప్పు వేసి గ్రైండింగ్ పూర్తయిన అనంతరం చక్కెర సైలోస్ మిషన్లో తయారైన చక్కెర పాకాన్ని మిషన్ ద్వారానే పప్పులో కలిపారు. యాలకుల పొడి, జీడిపప్పు, ఎండు ద్రాక్షలను ఆటోమెటిక్గా మిషన్ ద్వారా వేశారు. తయారైన లడ్డూలను కన్వేయర్ బెల్టుల ద్వారా విక్రయ కౌంటర్ వద్దకు చేర్చారు. కార్యక్రమంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ ఈఓ ఎన్. గీత, హరేకృష్ణ మూమెంట్ నిర్వహకులు పాల్గొన్నారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,69,493
రూ.100 దర్శనం టిక్కెట్ 21,700
వీఐపీ దర్శనాలు 75,000
వేద ఆశీర్వచనం 6,708
నిత్యకైంకర్యాలు 2,401
క్యారీబ్యాగుల విక్రయం 4,000
వ్రత పూజలు 67,000
కల్యాణకట్ట టిక్కెట్లు 24,400
ప్రసాద విక్రయం 4,36,785
వాహన పూజలు 14,200
టోల్గేట్ 1,460
అన్నదాన విరాళం 25,150
సువర్ణ పుష్పార్చన 1,12,280
యాదరుషి నిలయం 63,950
పాతగుట్ట నుంచి 32,765
శ్రీవారి ఖజానాకు శనివారం రూ.10,69,493
ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.