యాదాద్రి, సెప్టెంబర్17 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో పాంచరాత్రగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి.
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ
లక్ష్మీ నరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. మహిళా భక్తులు వేలాది మంది పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు.
నిజాభిషేకంతో ఆరాధనలు
యాదాద్రిలో ఆర్జిత పూజల కోలహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన నారసింహహోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. ఇక నిత్యకల్యాణోత్సంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండకింద గల పాతగోశాల వద్ద వ్రతమండపంలో జరిగిన సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,01,254
రూ.100 దర్శనం టిక్కెట్ 27,000
సుప్రభాతం 500
వేద ఆశీర్వచనం 2,580
నిత్యకైంకర్యాలు 1,800
క్యారీబ్యాగుల విక్రయం 3,000
వ్రత పూజలు 45,500
కల్యాణకట్ట టిక్కెట్లు 17,000
ప్రసాద విక్రయం 3,48,195
వాహన పూజలు 7,500
టోల్గేట్ 940
అన్నదాన విరాళం 33,580
సువర్ణ పుష్పార్చన 82,400
యాదరుషి నిలయం 56,870
పాతగుట్ట నుంచి 15,550
ఇతరవిభాగాలు 44,316
శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ.7,71,017
ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.