భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 17: వినాయక నిమజ్జనోత్సవానికి అన్ని చర్యలు చేపట్టినట్లు రాచకొండ కమిషనరేట్ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనోత్సవం పురస్కరించుకొని డీసీపీ నారాయణరెడ్డితో కలిసి భువనగిరి, బీబీనగర్లో శుక్రవారం చెరువులను పరిశీలించారు. అనంతరం భువనగిరిలోని సాయి కన్వెన్షన్హాల్లో పోలీసు సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి జోన్ పరిధిలో ఈనెల 19, 20తేదీల్లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు కల్గిన విగ్రహాలు 2,500 ఉండగా వెయ్యి మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయని ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా బారికేడ్లను, సిబ్బంది నియామకాలను చేపట్టామన్నారు. శోభాయాత్రల్లో పాత నేరస్తులు ఏదైనా ఆటంకాలను కల్పిస్తే కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన అంజనేయులు, వైస్చైర్మన్ చింతల కిష్టయ్య, బీబీనగర్లో ఏసీపీ వెంకట్రెడ్డి, భువనగిరి సీఐ జానయ్య, తాసీల్దార్ వెంకట్రెడ్డి, ఎస్ఐ రాఘవేందర్గౌడ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
నౌకాదళానికి భానుప్రకాశ్ ఎంపిక
అడ్డగూడూరు, సెప్టెంబర్ 17 : మండలంలోని లక్ష్మీదేవి కాల్వ గ్రామానికి చెందిన భానుప్రకాశ్ నౌకాదళానికి ఎంపికయ్యాడు. విశాఖపట్నంలో నిర్వహించిన రాత పరీక్షలో మంచి మార్కులు సాధించి ఫిజికల్ టెస్టులోనూ ఉత్తీర్ణుడైనట్లు తల్లిదండ్రులు కంచనపల్లి గీతారాణి, శ్రీనివాసాచారి ఆనందం వ్యక్తం చేశారు. సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, గ్రామస్తులు భానుప్రకాశ్ను అభినందించారు.