యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దసరా పండుగ
సందర్భంగా వరుస సెలవులు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దర్శన క్యూలైన్లు, బాలాలయం, పుర వీధులు, ప్రసాద విక్రయశాల ప్రాంగణం కిక్కిరిసిపోయాయి. శ్రీవారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టింది. స్వామివారికి వేద పండితులు, అర్చకులు లక్ష పుష్పార్చన చేశారు.
యాదాద్రి, అక్టోబర్16 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం వారాంతపు రద్దీ కొనసాగింది. దసరా పండుగతోపాటు వరుస సెలవులతో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్శన క్యూలైన్లు, బాలాలయం, పురవీధులు, ప్రసాద విక్రయశాల పరిసరాలు కిటకిటలాడాయి. శ్రీవారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ పునర్నిర్మాణ పనులతోపాటు భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించలేదు. స్వామివారి వైకుంఠద్వారం వద్ద వాహనాలను దారి మళ్లించి రింగురోడ్డుపై పార్కింగ్ చేయించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. స్వామివారి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు స్వామిని ఆరాధిస్తూ పూజలు చేశారు. హారతి నివేదనలు సమర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, సత్యనారాయణస్వామి పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం సర్వేషామేకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో విజయదశమి సందర్భంగా శుక్రవారం దసరా వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గజవాహనసేవ, ఆయుధ పూజ నిర్వహించారు. ఆలయ ఈఓ గీత, అనువంశికధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ ఏఈఓలు గజవెల్లి రమేశ్బాబు, రూరల్ సీఐ నర్సయ్య, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి క్షేత్రానికి అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్దిని సమేత రామలింగేశ్వర బాలాలయంలో శుక్రవారం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేందర్రావు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ చంద్రశేఖర్ స్వామివారి సుదర్శన నారసింహ హోమంలో పాల్గొని పూజలు చేశారు. శ్రీవారి ఖజానాకు రూ.13,23, 883 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 3,12,606
రూ.100 దర్శనం టిక్కెట్ 40,500
వీఐపీ దర్శనాలు 1,80,000
నిత్యకైంకర్యాలు 3,066
వేద ఆశీర్వచనం 6,192
క్యారీబ్యాగుల విక్రయం 4,000
వ్రత పూజలు 41,500
కల్యాణకట్ట టిక్కెట్లు 23,000
ప్రసాద విక్రయం 4,25,620
వాహన పూజలు 39,100
టోల్గేట్ 2,040
అన్నదాన విరాళం 30,427
సువర్ణ పుష్పార్చన 98,560
యాదరుషి నిలయం 32,360
పాతగుట్ట నుంచి 19,180
ఇతర విభాగాలు 12,000