ఉపాధి హామీ పనుల్లో అతివలే అధికం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు వేలల్లో పనులకు వెళ్లగా.. ప్రస్తుతం లక్షల్లో ఉంటున్నారు. మహిళా కూలీల భాగ స్వామ్యం మరింతగా పెరిగింది. మూడేండ్లలో
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధి పనుల్లో 8.86 లక్షల మంది పురుషులు పాలుపంచుకోగా, స్త్రీలు 12.41లక్షల మంది హాజరయ్యారు. పురుషులు రూ.295.88 కోట్ల వేతనం పొందగా, మహిళా కూలీలు రెట్టింపు స్థాయిలో రూ.452.84 కోట్లు అందుకున్నారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పనులు లేక సతమతమవుతున్న కూలీల ఉపాధికి కరోనా పరిస్థితులు మరింతగా గండి కొట్టాయి. సీఎం కేసీఆర్ మానవతా ధృక్పథంతో ఉపాధి హామీ పథకంలో విరివిగా పనులు కల్పించి వారికి అండగా నిలిచారు. ఉపాధిని వెతుక్కుంటూ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల నుంచి వేల సంఖ్యలో కూలీలు హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో.. వారంతా సొంతూళ్ళకు చేరుకున్నారు. చేసేందుకు పనులు లేక వలస కుటుంబాలు ఉపాధి కరువై విలవిల్లాడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం పనులు సైతం కూలీలకు కొండంత ఆసరాను ఇస్తున్నాయి. వలసవెళ్లి సొంతూళ్లకు వచ్చిన వారిలో చాలామందికి జాబ్కార్డులు లేకపోవడంతో.. అధికారులు వెంటనే అందించేలా చర్యలు తీసుకున్నారు. జాబ్ కార్డుల్లో ఇప్పటికే నమోదైన కూలీలతో పాటు సొంతూర్లకు వలస వచ్చిన కూలీలు కూడా ఉపాధి పనుల్లో పాల్గొంటుండడంతో రెండేండ్లలో కూలీల హాజరు శాతం గణనీయంగా పెరిగింది.
మహిళలకు ఆర్థిక చేయూత..
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా హాజరవుతున్నారు. గడచిన మూడేండ్లలో నల్లగొండ జిల్లాలో 4,31,368 మంది పురుషులు ఉపాధి పనులకు హాజరైతే మహిళలు అత్యధికంగా 5,69,769 మంది హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడేళ్ల కాలంలో పురుషులు 93,545 మంది హాజరైతే మహిళలు 2,21,293 మంది హాజరయ్యారు. అలాగే సూర్యాపేట జిల్లాలో 3,61,535 మంది పురుషులు ఉపాధి పనులకు హాజరుకాగా.. స్త్రీలు 4,50,013 మంది హాజరయ్యారు. మగవారితో పోలిస్తే అధిక ఉపాధి వేతనం తీసుకోవడంలోనూ మహిళలే ముందుంటున్నారు. మూడేండ్లలో ఉమ్మడి జిల్లాలో పురుషులు రూ.295.88కోట్ల మేర ఉపాధి వేతనం పొందగా.. స్త్రీలు రూ.452.84కోట్ల వేతనాన్ని అందుకుని ఆర్థిక చేయూతను పొందారు.