మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్నది. ఇప్పటివరకు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాలంటే చౌటుప్పల్ ప్రజలు రామన్నపేటకు, సంస్థాన్నారాయణపురం వారు నల్లగొండకు, భూదాన్పోచంపల్లివాసులు భువనగిరికి వెళ్లాల్సి వస్తున్నది. కక్షిదారుల వ్యయప్రయాసాలకు చెల్లుచీటి పలుకుతూ గురువారం చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభమవుతున్నది.
చౌటుప్పల్, సెప్టెంబర్ 14 : చౌటుప్పల్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ నెల 16న ప్రారంభం కానున్నది. పట్టణంలో కోర్టు లేక పోవడంతో కేసుల్లో ఉన్న వారు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధలను దూరం చేస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని సాంఘిక గురుకుల పాఠశాల భవనంలో కోర్టు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే భవనంలో సకల సౌకర్యాలు కల్పించారు. ఈ నెల 16న కోర్టును నల్లగొండ పోర్టుపోలియో జడ్జి అభినందన్కుమార్ సావలి ప్రారంభించనున్నారు. వర్చువల్ పద్ధతిలో ఆయన కోర్టును ప్రారంభిస్తారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎంవీ రమేశ్, రామన్నపేట అదనపు న్యాయమూర్తి కలిదిండి దుర్గారాణి , మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొననున్నారు.
తగ్గనున్న దూర భారం..
గతంలో చిన్న కేసులకు సైతం సుదూర ప్రాంతాల్లోని కోర్టులకు వెళ్తున్నారు. చౌటుప్పల్ పట్టణ వాసులు రామన్నపేటకు, సంస్థాన్నారాయణపురం మండల ప్రజలు నల్లగొండకు, భూదాన్పోచంపల్లి వాసులు భువనగిరి కోర్టుకు వెళ్తున్నారు. ఆయా కోర్టులకు హాజరయ్యేందుకు దూరం వెళ్లడంతో పాటు ఒక రోజు మొత్తం దానికే కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఈ మూడు మండలాల ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి.
కోర్టు ఏర్పాటు హర్షణీయం
చౌటుప్పల్ మున్సిపాలిటీలో జూనియర్ కోర్టు ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో కోర్టు ఏర్పాటుకు అనుమతినివ్వడం సంతోషకరం. దీంతో కక్షిదారుల ఇబ్బందులు తప్పనున్నాయి. కోర్టు ఏర్పాటుకు సహకరించిన జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు.
కక్షిదారుల బాధలు తీరుతాయి
ఈప్రాంత కక్షిదారులు పడుతున్న బాధలకు చెక్పడనుంది. గురువారం చౌటుప్పల్లో జూనియర్ కోర్టు ప్రారంభమవుతున్నది. దీంతో ఇకపై ఇక్కడే కేసులు పరిష్కారం కానున్నాయి. కోర్టు ఏర్పాటు చేయించేందుకు కృషి చేసిన పెద్దలకు ధన్యవాదాలు.
ఇబ్బందులు తప్పుతాయి
చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కోర్టు ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వం కూడా అందుకు అనుమతి ఇచ్చింది. సాంఘిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయిస్తున్నాం. కోర్టు ఏర్పాటు వల్ల చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, భూదాన్పోచంపల్లి మండలాల ప్రజల ఇబ్బందులు తప్పుతాయి.