యాదాద్రి భువనగిరి, అక్టోబర్13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్టంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై మరింత దృష్టి పెట్టింది. ఎంఎస్ఈలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎనిమిది ఎంఎస్ఈలను ఏర్పాటు చేయనుండడంతోపాటు, మరో పన్నెండింటిని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి, చిట్యాల, కోదాడ పారిశ్రామికవాడలు అప్గ్రేడ్ కానున్నాయి. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపురంలో 400 ఎకరాల్లో ఎంఎస్ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకాగా, మరో నాలుగు పారిశ్రామిక వాడలు అప్గ్రేడ్ అవుతుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామికాభివృద్ధ్దికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కొత్త పరిశ్రమలను ఆకర్షించడంతో పాటు ఉన్న పరిశ్రమల విస్తరణకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున కల్పించడానికి పారిశ్రామిక రంగం ప్రధానమైనదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రధానంగా.. అనుమతులు, అనవసర జాప్యం లేకుండా ఏర్పాట్లు చేసింది. పారిశ్రామిక రంగంలో.. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పెట్టుబడితో ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించనుండగా.. వీటిని మారుమూల ప్రాంతంలోనైనా ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో స్థానికులకే ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభించన్నాయి.
పరిశ్రమల స్వర్గధామంగా యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 532 వరకు భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. ఫలితంగా 34వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంతకు రెట్టింపు సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. తాజాగా.. ప్రముఖ పారిశ్రామిక సంస్థ హెచ్ఎస్ఐఎల్ ఇప్పటికే భువనగిరిలో గాజు పరిశ్రమ, బీబీనగర్లో సిరామిక్ ఇండస్ట్రీని నడుపుతుండగా.. రూ.230 కోట్ల వ్యయంతో భువనగిరిలో మరో ప్లాంట్ను ఏర్పాటు చేసి గాజు పరిశ్రమను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో 700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలో ఇప్పటికే ఎంఎస్ఎన్ కంపెనీ, ఆహార పదార్థాల తయారీకి సంబంధించి బాంబినో, శ్రియం ల్యాబ్స్ వంటి ఎన్నో ప్రముఖ కంపెనీలు బీబీనగర్ ప్రాంతంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. బీబీనగర్ సమీపంలో జైన్, చౌటుప్పల్ ప్రాంతంలో దివీస్, శ్రీని వంటి పెద్ద ఫార్మా కంపెనీలతో పాటు మరో 50 వరకు చిన్న ఫార్మా కంపెనీలు కొనసాగుతున్నాయి. వీటిల్లో వేల మం ది ఉపాధి పొందుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఇండ్రస్ట్రియల్ పార్కుతో 15వేల మందికి ప్రత్యక్షంగా.. మరో 20వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఉత్పత్తులను సైతం ప్రారంభించాయి.
ఎంఎస్ఈల అప్గ్రేడ్తో మరింత మందికి ఉపాధి
రాష్ట్రవ్యాప్తంగా 12 ఎంఎస్ఈలను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నల్లగొండ, భువనగిరి, చిట్యాల, కోదాడలో ఉన్న ఎంఎస్ఈలు అప్గ్రేడ్ కానున్నాయి. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న ఎంఎస్ఈలతో ఎంతోమందికి ఉపాధి లభిస్తుండగా అప్గ్రేడ్ అనంతరం మరింత మందికి ఉపాధి లభించనుంది. వీటిలో ఇప్పటికే రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు ఉండగా.. పెరిగిన అవసరాల మేరకు ఉద్యోగులు, సిబ్బందికి నైపుణ్య శిక్షణా కేంద్రం, అదనపు మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చించనున్నది. కేంద్రం కూడా కొంత సాయం చేయనుండగా.. 2021 జనవరి నాటికి వీటిని పూర్తిస్థాయిలో అప్గ్రేడ్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మేరకు అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అదనపు వసతుల కల్పన, నైపుణ్య శిక్షణ కేంద్రాలకు సంబంధించిన కార్యకలాపాలు మొదలవుతాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.