సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఎటువంటి ఫిట్నెస్ పరీక్షలు
చేయించకుండానే ప్రైవేటు స్కూల్ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఏడాదికోసారి ఫిట్నెస్ పరీక్షలు చేయించడం తప్పనిసరి కాగా ఈ ఏడాది సెప్టెంబర్ గడువు నాటికి జిల్లాలో ఉన్న 272 బస్సులకు 41 బస్సులు మాత్రమే సర్టిఫికెట్ పొందాయి. ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్న తర్వాతే బస్పులు రోడ్డెక్కాల్సి ఉండగా.. ప్రైవేటు పాఠశాలలు ఈ నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో బడి పిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సామర్థ్యంలేని బస్సులను నడుపడం వల్ల పొంచి ఉన్న ప్రమాదాల నివారణపై రవాణా శాఖ సైతం దృష్టిసారించడం లేదు. ఫిట్నెస్ పరీక్షల గడువును ప్రభుత్వం అక్టోబర్ నెలాఖరు వరకు మరోసారి పొడిగించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఇకనైనా స్పందిస్తాయో లేదో కానీ ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? అన్న ప్రశ్న మాత్రం తలెత్తుతున్నది.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా ప్రభావంతో ఏడాదిన్నర కాలంగా పాఠశాలలు మూతపడగా ప్రైవేటు స్కూల్ బస్సులు నడవలేదు. ఈ వాహనాలకు రెండేండ్లుగా వాహన సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించలేదు. ప్రస్తుతం స్కూల్స్ తెరిచినప్పటికీ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించిన తర్వాతే రోడ్లపై తిప్పాల్సి ఉంది. కానీ చాలావరకు ప్రైవేటు పాఠశాలల బస్సులు రోడ్లపై యథావిధిగా తిరుగుతున్నాయి. దీనిపై రవాణాశాఖ అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సులు ఎంతవరకు ఫిట్నెస్ కలిగి ఉన్నాయన్న సంగతి మర్చిపోయారు. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప ఇతర ఏ సందర్భాల్లోనూ డీటీఓ అధికారులు తనిఖీలపై దృష్టిసారించడం లేదనే విమర్శలూ ఉన్నాయి.
ఫిట్నెస్ కోసం వచ్చింది 41 బస్సులే
జిల్లాలో ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు 168 వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు నలభై వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా పాఠశాలల యాజమాన్యాలు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులను తమ పాఠశాలకు తీసుకొచ్చేందుకు 272 వరకు బస్సులను నడిపిస్తున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందే బస్సులను డీటీఓ కార్యాలయానికి తీసుకొచ్చి ఫిట్నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాహన కండీషన్తో పాటు పిల్లల భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే అధికారులు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ను ఇస్తారు. సెప్టెంబర్ 30 వరకు అన్ని పాఠశాలలు తమ బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలని ప్రభుత్వం గడువు విధించగా.. కేవలం 41 బస్సులు మాత్రమే ఫిట్నెస్ కోసం వచ్చాయి. మిగతావి యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి.
ఆర్థిక భారంతోనే వెనుకంజ
కరోనా కారణంగా పాఠశాలలు మూతబడడంతో ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించారు. దీంతో చాలావరకు ప్రైవేటు స్కూల్స్ ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉన్నాయి. కార్పొరేట్ పాఠశాలలు మినహా మిగతా వాటి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం కూడా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఆర్థిక భారంగా మారింది. మూలనపడ్డ బస్సులను పూర్తి కండీషన్లోకి తీసుకు రావడానికి అధిక ఖర్చు అవుతుందని యాజమాన్యాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ట్యాక్స్, పర్మిట్ ఫీజులతో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడం తమకు శక్తికి మించిన భారమని యాజమాన్యాలు వాపోతున్నాయి. గడువును నవంబర్ వరకు పెంచితే తమకు వెసులుబాటుగా ఉంటుందని ఇటీవల డీటీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.
ఫిట్నెస్ లేకుంటే కఠిన చర్యలు
ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందకుండా స్కూల్ బస్సులను రోడ్లపై నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం గడువును అక్టోబర్ నెలాఖరునాటికి పెంచింది. అప్పటి వరకు ఫిట్నెస్ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత ఫిట్నెస్ పొందని బస్సులను నడిపితే సీజ్ చేస్తాం.