కరోనా కట్టడికి నిబంధనల పాటింపే మొదటి మందు
అవగాహన చర్యలు విస్తృతం చేసిన వైద్యారోగ్య శాఖ
సహకరిస్తున్న పోలీసు, మున్సిపల్ శాఖలు
సెలవులు లేకుండా ఏప్రిల్ నెల మొత్తం పరీక్షలు, వ్యాక్సినేషన్ విధులు
ఒక్క రోజులోనే రెట్టింపైన కేసులు.. అప్రమత్తమైన అధికారులు
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 3 : కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఒక్క రోజే కరోనా కేసులు రెండింతలు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించగా అధికారులు సమీక్ష నిర్వహించారు. కొద్ది నెలలుగా సింగల్ డిజిట్కే పరిమితమైన కేసుల సంఖ్య శనివారం రెండింతలు పెరిగి సుమారు 15కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఏప్రిల్ నెల మొత్తం సెలవు దినాల్లో సైతం విధులు నిర్వర్తించడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 45 సంవత్సరాల వయసు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
వివిధ శాఖల సమన్వయంతో..
ప్రజల్లో అవగాహన కల్పించడానికి జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీసు, మున్సిపల్ శాఖల సహాయ, సహకారాలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసులు మాస్కులు పంపిణీ చేయడం, మాస్కులు ధరించని వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం, నగరంలో ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానా సైతం విధిస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో కరోనాపై అవగాహన కల్పించడానికి స్వచ్ఛ ఆటోలను వినియోగించుకోనున్నారు. మైక్ ద్వారా ప్రచారం నిర్వహించడానికి చర్యలు ప్రారంభించారు.
అలసత్వం వీడాలి..
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా నిబంధనల పాటించడంపై ప్రజల్లో అలసత్వం పెరిగిపోయిందని, అందుకే కరోనా రెండో విడుత ప్రభావం ఎక్కువగా ఉందంని వైద్యులు అంటున్నారు. కరోనా నిబంధనలు, రక్షణ చర్యలు రానున్న రోజుల్లో జీవితకాలపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చూడండి..
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ