గౌరెల్లి-కొత్తగూడెం వరకు 30వ జాతీయ రహదారి
నాలుగైదు రోజుల్లో విడుదల కానున్న గెజిట్
ఎంపీ మాలోత్ కవిత చొరవతో గ్రీన్సిగ్నల్
తగ్గనున్న 100 కిలోమీటర్ల దూరం
మహబూబాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్కు మరో జాతీయ రహదారి మంజూరైంది. ఇప్పటికే ఎన్హెచ్ 563, ఎన్ఎచ్ 365లు ఉండగా తాజాగా హైదరాబాద్ రింగ్రోడ్డు నుంచి కొత్తగా జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మార్గాన్ని ఎన్హెచ్-30గా అధికారులు గుర్తించారు. నాలుగైదు రోజుల్లో గెజిట్ విడుదల కానుంది. కొత్తగా మంజూరైన జాతీయ రహదారితో కలిపి జిల్లా మీదుగా వెళ్లే ఎన్హెచ్ల సంఖ్య మూడుకు చేరింది. కొత్తగా హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు(గౌరెల్లి) నుంచి వలిగొండ, మహబూబాబాద్ మీదుగా కొత్తగూడెం వరకు రోడ్డును ఎన్హెచ్-30గా కేంద్రం గుర్తించింది.
ఎంపీ కవిత కృషితో..
జాతీయ రహదారి కోసం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కొంతకాలంగా విశేష కృషి చేశారు. అనేక సందర్భాల్లో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కొత్తగా నిర్మించబోయే ఎన్ఎచ్-30 ఏజెన్సీ ప్రాంతాలకు ఎంతగానో ఉపయోగపడడంతో పాటు భద్రాచలం పుణ్యక్షేత్రానికి భక్తులు సులభంగా చేరుకునే వీలుంటుంది. ఈ క్రమంలో కేంద్రం ఇటీవల మంజూరు చేసిన వాటిలో ఎన్హెచ్-30కి గ్రీన్సిగ్నల్ లభించింది. ఈ హైవేతో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఎంతో అభివృద్ధి చెందనున్నాయి. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం గోదావరి తీరాన ఉన్న భద్రాచలం దేవస్థానానికి, విశాఖ పోర్టు, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు దాదాపు 100కిలో మీటర్ల దూరం తగ్గనుంది.
ఏజెన్సీ ప్రాంతాలకు ‘రహదారి’..
కొత్త జాతీయ రహదారితో జిల్లా ప్రజలు ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం వరకు అలాగే మహబూబాబాద్ నుంచి తొర్రూరు వరకు సాఫీగా ప్రయాణించవచ్చు. ఏటా భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలకు జిల్లా నుంచి వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య తప్పనుంది. సుమారుగా రూ.2వేల కోట్లతో 234 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మించనున్నారు.
ఇవి కూడా చూడండి..
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు
ప్రధాని అయితే ఏం చేస్తారు? ఇదీ రాహుల్ గాంధీ సమాధానం