ఏటూరునాగారం, 28: ములుగును పోషకాహార లోపం లేని తీర్చిదిద్దాలని, మహిళల్లో రక్తహీనత నివారణకు పౌష్టికాహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వీ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా రక్షణ, శిశు, కిశోర బాలికల బరువు పెంచడం, పోషణ, సంక్షేమం, జిల్లాలో పోషణ అభియా న్, అంగన్వాడీలో పోషకాహారం అందజేత వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 65 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, 51శాతం మంది గర్భిణుల్లోనూ ఇదే సమస్యతో ఉన్నట్లు గుర్తించామన్నారు. మహిళలు ఆకుకూరలు, పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పుట్టిన పిల్లలకు ముర్రు పాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఏజెన్సీలో మహిళల పోషణ స్థితిని మెరుగు పరచాలన్నారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల్లో పౌష్టికాహార విలువలు పెంచేందుకు ఏయే చర్యలు తీసుకోవాలో వివరించారు. గ్రామాల్లో ఇంటింటా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి రక్తహీనతతో ఉన్న వారిని గుర్తించి పోషకాహారం, ఐరన్ ట్యాబెట్లు అందించా లని ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి జిల్లాను ఉత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. వెయ్యి రోజుల ప్రణాళిక ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ సహకారంతో జిల్లాలో అంగన్వాడీ సెంటర్లకు నూతన భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. గిరిజన పిల్లల విద్య కోసం ఆశ్రమ పాఠశాలలు పనిచేస్తున్నాయని, అదేవిధంగా వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తూ పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మా ట్లాడుతూ రక్తహీనత వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయన్నారు.
జిల్లాలో 646 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, ఇక్కడ ఏర్పా టు చేసిన పలు స్టాల్స్ను చైర్పర్సన్ సందర్శించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో అంకిత్, కార్యదర్శి కృష్ణకుమారి, సభ్యులు కటారి రేవతి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, షహీన్ అఫ్రోజ్, అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఎంహెచ్వో అప్పయ్య, డీడబ్ల్యువో ప్రేమలత, ఈఈ హేమలత, సీడీపీవో హేమలత, సూపర్వైజర్లు మల్లేశ్వరి, ముత్తమ్మ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.