నర్సంపేట, సెప్టెంబర్ 25: నర్సంపేట నియోజకవర్గానికి మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 35 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా గురుకులం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు పెద్ది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నర్సంపేటను ఎడ్యుకేషల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కస్తూర్బా బాలికల విద్యాలయాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ బాలికలకు మెరుగైన విద్యనందిస్తున్నదని కొనియాడారు. కొత్తగా మంజూరైన రెసిడెన్షియల్ పాఠశాలతో నియోజకవర్గంలో తొమ్మిది గురుకులాలు ఉన్నట్లు వివరించారు.
నెక్కొండలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల(బాలికలు), నల్లబెల్లిలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల(బాలురు), దుగ్గొండిలో టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల(బాలికలు), నర్సంపేటలో మైనార్టీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల(బాలికలు), ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల(బాలురు), ఖానాపురం మండలంలో గిరిజన సైనిక్ పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల(బాలుర), నర్సంపేట మండలం మహేశ్వరంలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల(బాలురు), నల్లబెల్లిలో ఆశ్రమ బాలికల జూనియర్ కళాశాల ఉన్నట్లు వెల్లడించారు. కొత్తగా మంజూరైన బీసీ గురుకులాన్ని నర్సంపేటలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా నర్సంపేట డివిజన్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను పిల్లలు వినియోగించుకోవాలని కోరారు.