హనుమకొండ చౌరస్తా, మే 18 : ప్రజారవాణా వ్యవస్థలో అతిపెద్ద సంస్థగా పేరుగాంచిన ఆర్టీసీ నిరుద్యోగులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. సంస్థ అభివృద్ధి గురించి ఆలోచిస్తూనే సామాన్యులను దృష్టిలో పెట్టుకొని సరికొత్త నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రత్యేక రోజుల్లోనే రాయితీ ప్రకటించే ఆర్టీసీ.. ఈసారి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారి కోసం మూడు నెలల పాటు బస్సుపాస్లపై 20శాతం రాయితీ ఇస్తూ శుభవార్త చెప్పడం నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం ఆర్టీసీ ఆఫర్ ప్రకటించింది. యువత కోసం బస్సు చార్జీలపై రాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీచేశారు. పేద అభ్యర్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సంస్థ ఎండీ సజ్జనార్ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్పాస్లపై మూడు నెలలకు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ, గ్రూప్-1 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. అయితే రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత కోసం సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్పాస్లపై 20శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించి మూడు నెలల పాటు ఈ రాయితీ కొనసాగించనున్నారు.
ఈ బస్పాస్ పొందడానికి దరఖాస్తుపై సంతకం చేసి ఆధార్కార్డుతో పాటు కోచింగ్ సెంటర్ ఐడీకార్డు లేదా ప్రభుత్వం జారీచేసిన నిరుద్యోగ గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత బస్చార్జీలు 22కిలోమీటర్ల పరిధిలో సిటీ ఆర్డినరీ రూ.3,450, ఎక్స్ప్రెస్ రూ.3,900 వరకు ఉండగా పోటీ అభ్యర్థులకు 20శాతం రాయితీ కల్పించడంతో ఆర్డినరీ రూ.2,800, ఎక్స్ప్రెస్ రూ.3,200లుగా చార్జీలు తీసుకోనున్నారు. కోచింగ్ క్లాసులకు హాజరవుతున్న నిరుద్యోగులకు ఈ ప్రత్యేక ఆఫర్ వర్తించనుంది. అన్ని బస్పాస్ కౌంటర్లలోనూ వీటిని తీసుకోవచ్చు.
సామాన్య ప్రజల కోసమే ఆర్టీసీ ప్రత్యేకంగా ఆఫర్లు పెట్టింది. ఎండీ సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక రోజుల్లో ఉచిత ప్రయాణాలు, ఆఫర్లను తీసుకువస్తున్నారు. ఇప్పుడు బస్పాస్లపై నిరుద్యోగులకు 20శాతం రాయితీ కల్పిస్తోంది. కోచింగ్ సెంటర్లకు వెళ్లే అభ్యర్థులు ఆర్డీనరీ, ఎక్స్ప్రెస్లో ఈ రాయితీ పొందవచ్చు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారి ఎంతో ఉపయోగకరం.
– శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం