ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు వరి నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉన్న వారు ఇప్పటికే నాట్లు పూర్తి చేయగా, చెరువు ఆయకట్టు రైతులు నాటు వేయడంలో బిజీగా ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత ఏడాది 1,06,990 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 1,01,600 ఎకరాల్లోనే సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో ఇప్పటివరకు 45వేల నుంచి 50వేల ఎకరాల వరకు నాట్లు పూర్తికాగా, మిగిలిన 50వేల ఎకరాల్లో మరో 15రోజుల్లో నాట్లు పూర్తికానున్నాయి. అంతేకాకుండా సాగుకు అవసరమైన 7వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో జోరుగా వరినాట్లు కొనసాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈసారి జూలైలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పడాల్సిన వాన ఒక్క జూలైలోనే కుండపోతగా కురవడంతో వరదలు ఉప్పొంగాయి. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండి మత్తళ్లు దుంకుతూ జలకళ సంతరించుకున్నాయి. దీంతో వరినాట్లు ఊపందుకున్నాయి.
గతేడాది ఆలస్యం కాగా, ఈసారి మాత్రం ఆగస్టు నెలలోనే పూర్తి కానున్నాయి. ఇతర పంటల కంటే వరిసాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఏడాది కంటే ఈసారి కొంతమేర తగ్గనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 1,06,990 ఎకరాల్లో వేయగా, ఈ ఏడాది 1.01,600 ఎకరాల్లో రైతులు సాగుచేయనున్నట్లు తెలిపారు. ఈసారి చాలామంది రైతులు సన్నాల సాగుకు ఆసక్తి చూపారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సులువుగా మార్కెటింగ్కు అవకాశం సన్న సన్న వడ్లు 60శాతం మేర వేస్తున్నారు. జిల్లాలో వరి సాగు అంచనా 1,01,600 ఎకరాలు కాగా, ఇప్పటికే సుమారు 50వేల ఎకరాల్లో వరి నాట్లు వేయగా, మరో 15రోజుల్లో పూర్తి కానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలో వరి సాగుకు అవసరమైన 7వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలో అన్ని రకాల సరిపడ ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి కొరతలేదు. నత్రజని, భాస్వరం సంబంధిత 20:20, డీఏపీ, 28:28, 17:17:17 ఎరువులు ఆధీకృత డీలర్లు, ప్రాథమిక సహకార సంఘాలు, మన గ్రోమోర్ కేంద్రాల్లో ఉన్నాయి. రైతులు ఆధార్ నంబర్ ద్వారా ఎరువులను పొందవచ్చు.
– విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జయశంకర్ భూపాలపల్లి