నర్సంపేట, ఆగస్టు 15 : ఉచితాలు మంచివి కావని పేర్కొంటూ తెలంగాణలో సంక్షేమ పథకాలపై కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం కొత్తగా 336 మందికి మంజూరైన ఆసరా పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలకు తెర తీస్తున్నాయన్నారు. దేశంలోనే ఎక్కువ మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పాలన అంటే అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమేనన్నారు.
లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించి లబ్ధిదారుల దీవెనలతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 11,195 మందికి ఆసరా పింఛన్లు మంజూరయ్యాయన్నారు. చెన్నారావుపేటలో 1,644, దుగ్గొండిలో 1,547, ఖానాపురంలో 1,452, నల్లబెల్లిలో 1,474, నర్సంపేట రూరల్లో 1,871, నర్సంపేటలో 1,148, నెక్కొండలో 2,059 మందికి పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. ఉపాధి హామీ కూలీలకు ఎనిమిది గంటల పనివిధానం ప్రవేశపెట్టి ఒక్కొక్కరికి రూ.235 ఇస్తామని కేంద్రం చెబుతున్నదన్నారు. దీనివల్ల కూలీలకు కూలి గిట్టుబాటు కాదన్నారు.
ఆసరా పింఛన్లు అందించి ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే పెద్ది నర్సంపేటలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ తదితరులు పాల్గొన్నారు.