పదో తరగతి పరీక్షల్లో బాలికలు పైచేయి సాధించారు. జిల్లావ్యాప్తంగా 92.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఇందులో బాలురు 90.81%, బాలికలు 93.65% మంది ఉన్నారు. మొత్తం 9,881 మంది విద్యార్థులకు 9,111 మంది ఉత్తీర్ణులయ్యారు. 5039 మంది బాలురకు 4,576.. అలాగే 4,842 మంది బాలికలకు 4,535 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతలో జిల్లా రాష్ట్రస్థాయిలో పందోమ్మిదో స్థానంలో నిలువగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. కాగా, జిల్లాలోని దుగ్గొండి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. – గిర్మాజీపేట, జూన్ 30
పది పరీక్షా ఫలితాల్లో 92.21 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 19వ స్థానంలో నిలిచినట్లు డీఈవో వాసంతి ఒక ప్రకనటలో పేర్కొన్నారు. పది పరీక్షలకు 5,039 మంది బాలురు హాజరుకాగా 90.81 శాతంతో 4,576 మంది ఉత్తీర్ణత సాధించారు. 4,842 మంది బాలికలు హాజరు కాగా 4,535 మంది పాసయ్యారు. మొత్తం 9,881 మంది విద్యార్థులకు 9,111 మంది ఉత్తీర్ణులయ్యారు. దుగ్గొండి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలువగా.. 83.62 ఉత్తీర్ణత శాతంతో పర్వతగిరి మండలం చివరిస్థానంలో నిలిచినట్లు డీఈవో పేర్కొన్నారు. నల్లబెల్లి మండలం 98.65 శాతం, రాయపర్తి 96.14, నర్సంపేట 96.06, ఖానాపురం 95.19, గీసుగొండ 94.25, చెన్నారావుపేట 92.54, సంగెం 92.37, వరంగల్ 92.23, నెక్కొండ 90.07, వర్ధన్నపేట 89.49, ఖిలావరంగల్ మండలంలో 88.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
జిల్లాలో మొత్తం 10 కేజీబీవీలు ఉండగా 343 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 303 మంది (88శాతం) ఉత్తీర్ణత సాధించారు. దుగ్గొండి, నల్లబెల్లి కేజీబీవీలు 100 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానం సాధించగా.. రాయపర్తి కేజీబీవీ 97 శాతంతో రెండో స్థానంలో, ఖానాపురం కేజీబీవీ 96.4 శాతంతో మూడో స్థానం సాధించింది.
జిల్లాలోని ఆరు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ పాఠశాలలు ఉండగా, సంగెం మోడల్స్కూల్ 100 శాతం ఉత్తీర్ణత సాధించి టాప్లో నిలిచింది. ఖానాపురం, గీసుగొండ మోడల్ స్కూళ్లు 99 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి. ఈ స్కూళ్ల నుంచి 588 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 95 శాతం ఉత్తీర్ణతతో 559 మంది పాసయ్యారు.
పదిలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆగస్టులో నిర్వహించే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే వారు జూలై 18వ తేదీలోగా ఫీజు చెల్లించాలని డీఈవో సూచించారు. రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఎస్బీఐ బ్యాంకులో చలాన్ తీసి 15 రోజుల్లోగా దరఖాస్తులను డీజీఈ కార్యాలయానికి పంపాలని కోరారు.