నిధుల ఖర్చు అధికారం పాలకవర్గాలకు..
గ్రామ సభ ఆమోదం ఉంటే సరి
తొలగిన అధికారుల అనుమతి నిబంధన
పంచాయతీలకు నిధుల వరద
కొత్త పవర్తో అభివృద్ధి జోష్
పాలకవర్గాల హర్షాతిరేకాలు
నాగర్కర్నూల్, మార్చి 29, నమస్తే తెలంగాణ: పల్లెల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నది. బంగారు తెలంగాణ సాధనలో కీలకమైన గ్రామాల ముఖ చిత్రాలను మార్చేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు పాలకవర్గాల్లో కొత్త జోష్ను తీసుకొచ్చింది. ప్రభుత్వం మంజూరు చేసే నిధులను పాలకవర్గం గ్రామ సభ ఆమోదంతో ఖర్చు చేసే అధికారాన్ని పంచాయతీలకు కట్టబెట్టింది. దీంతో రాబోయే రోజుల్లో పల్లెల్లో అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కనున్నది.
గ్రామ పంచాయతీలకు కొత్త అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పంచాయతీల ఖాతాల్లోని నిధులను గ్రామ సభ ఆమోదంతోనే ఇకపై ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారుల అనుమతి నిబంధనతో తలెత్తుతున్న జాప్యం, ఇబ్బందులు ఈ కొత్త ఉత్తర్వుతో తొలగిపోనున్నాయి. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. పల్లె ప్రగతి పథకంతో గ్రామాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో మున్ముందుకు సాగుతున్నాయి. ప్రతి పంచాయతీకి జనాభాను బట్టి నెలనెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.లక్షల్లో నిధులు వస్తున్నాయి. ప్రతి పంచాయతీలో ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం అందుతున్నది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం, పల్లె ప్రకృతి వనం, వన నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం, ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాల్లాంటి పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గతంలో ట్రెజరీల్లో నిధులు జమ అయ్యేవి. దీనివల్ల పంచాయతీలకు చేరడంలో జరిగే జాప్యాన్ని తగ్గించేందుకు పంచాయతీ ఖాతాల్లోనే నేరుగా నిధులను జమ చేసేందుకు నిర్ణయించింది. నిధులు ఖర్చు పెట్టే విషయంలోనూ ఎదురవుతున్న ఆటంకాలను ప్రభుత్వం గుర్తించింది. మైనర్ పంచాయతీల్లో సివిల్ పనులకు రూ.లక్ష, మేజర్ పంచాయతీలకు రూ.2లక్షల వరకు ఖర్చు చేసుకునే అధికారం ఉంటుంది. ఇంతకంటే అధికంగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తే పంచాయతీ అధికారులు, ఆపై కలెక్టర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీని స్థానంలో ఇకపై నిధుల మంజూరులో పంచాయతీలకు ఇబ్బందులు కలగకుండా, అధికారుల అనుమతికి ప్రత్యామ్నాయంగా ఆ అధికారం పంచాయతీలకే ప్రభుత్వం కట్టబెట్టింది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా జీవోని విడుదల చేశారు. దీని ఆధారంగా ఇకపై పంచాయతీల్లో చేసే నిధులకు ఆయా గ్రామ సభ ద్వారా పాలకవర్గాలే మంజూరు చేసుకోవచ్చు.
చాలా మంచి నిర్ణయం
గ్రామ సభ తీర్మానంతో నిధులు ఖర్చు చేసుకునే అధికారం పంచాయతీలకు కల్పించడం చాలా మంచి నిర్ణయం. సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లికి ధన్యవాదాలు. ఈ విధానం వల్ల పనుల అమలులో నిధుల సమస్యలు ఎదురు కావు. గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు. అభివృద్ధి పనులు వేగంగా జరిగేందుకు ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
పండంటి బిడ్డ కోసం.. పక్కా ప్రణాళిక
పుచ్చకాయ విత్తనాలతో అద్భుతమైన లాభాలు..!